జీహెచ్ఎంసీలో 92వేల మందికి వ్యాక్సిన్

by  |
Minister Talsani Srinivas Yadav
X

దిశ, తెలంగాణ బ్యూరో: సూపర్ స్ర్పెడర్స్ కు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించనప్పటి నుంచి 92వేల మందికి వ్యాక్సిన్ పంపిణీ చేపట్టామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం సనత్ నగర్ లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ప్రభుత్వం చేపట్టిన చర్యల వలన రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయని వెల్లడించారు. వ్యాక్సిన్ కోసం వచ్చే వారు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్ట్రీట్ వెండర్స్, మాంసం దుఖాన దారులు, కూరగాయల విక్రయదారులు తదితర చిన్న వ్యాపారుల కోసం జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిల్ లలో వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

ఈ నెల 3 నుండి ఆటో డ్రైవర్ లకు వ్యాక్సిన్ వేయనున్నట్లు ప్రకటించారు. లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆదాయాన్ని కోల్పోతున్నప్పటికీ ప్రజల ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతుందని చెప్పారు. అమీర్ పేట లోని 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేసేందుకు పరిశీలన చేస్తున్నామని చెప్పారు. కరోనా నియంత్రణ లో వైద్యులు, నర్స్ లు, ఆశ వర్కర్ల కృషి ఎనలేనిదని ప్రశంసించారు.

Next Story