వచ్చే నెలలో పిల్లలకు టీకా.. క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి!

by  |
వచ్చే నెలలో పిల్లలకు టీకా.. క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి!
X

న్యూఢిల్లీ: వచ్చే నెల నుంచి పిల్లలకు టీకా పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టే అవకాశముందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. మనదేశంలో చాలా కంపెనీలకు వ్యాక్సిన్ ఉత్పత్తికి లైసెన్సులు పొందనున్నాయని, ఫలితంగా ప్రపంచంలో అతిపెద్ద టీకా ఉత్పత్తిదారుగా భారత్ నిలవనున్నట్టు అంచనా వేశారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరవడం గమనార్హం. 12 ఏళ్ల నుంచి 18 ఏళ్ల పిల్లల కోసం త్వరలోనే టీకా అందుబాటులోకి రానుందని, దానికి అనుమతి లభించగానే వ్యాక్సినేషన్‌పై మార్గదర్శకాలు రూపొందిస్తామని ఢిల్లీ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే తెలియజేసింది.

ఈ ఏజ్ గ్రూప్ వారిపై జౌదూస్ క్యాడిలా అభివృద్ధి చేసిన డీఎన్ఏ టీకాల ట్రయల్స్ పూర్తయినట్టూ వివరించింది. త్వరలోనే ఈ టీకా అందుబాటులోకి వస్తుందని తెలిపింది. రెండేళ్ల నుంచి 18ఏళ్ల పిల్లలపై ట్రయల్స్ చేపట్టడానికి డీసీజీఐ ఇటీవలే కొవాగ్జిన్ తయారీదారు భారత్ బయోటెక్‌కు అనుమతినిచ్చింది. ఈ ట్రయల్స్‌లో సెప్టెంబర్‌లో ముగియనున్నట్టు అంచనాలున్నాయి. 12ఏళ్ల నుంచి 15ఏళ్ల పిల్లలకు ఐరోపా సమాఖ్య అనుమతించిన ఫైజర్ వ్యాక్సిన్ భారత్‌కు వచ్చే సమయంపై అస్పష్టత కొనసాగుతుండటంతో దేశీయ టీకా తయారీదారులవైపే కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు సంబంధితవర్గాలు వెల్లడించాయి.



Next Story

Most Viewed