నిరుద్యోగులు అధైర్య పడొద్దు.. అందరికీ అండగా ఉంటా..

by  |
నిరుద్యోగులు అధైర్య పడొద్దు.. అందరికీ అండగా ఉంటా..
X

దిశ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణ‌లో నిరుద్యోగులెవ‌రూ అధైర్య పడొద్దని వైఎస్ ష‌ర్మిల యువ‌కుల‌కు అభ‌య‌మిచ్చారు. హైద‌రాబాద్ లోట‌స్ పాండ్ లో మంగ‌ళ‌వారం వరంగల్ జిల్లాకు చెందిన యువ‌కుల‌తో ష‌ర్మిల స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ‌చ్చేది మ‌న ప్రభుత్వమేన‌ని, అంద‌రికీ అండ‌గా నిలుస్తాన‌ని ఆమె పేర్కొన్నారు.

మ‌న ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చాక డ‌బ్బు లేద‌ని చ‌దువులు మ‌ధ్యలోనే ఆపేసే అవ‌కాశం ఉండ‌ద‌ని వ్యాఖ్యానించారు. అంద‌రికీ ఉచిత విద్య అందే రోజు ఎంతో దూరంలో లేద‌ని అన్నారు. త‌న తండ్రి వైఎస్సార్ ప్రవేశ‌పెట్టిన ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ప‌థ‌కం అంద‌రికీ వ‌ర్తింప‌జేస్తామ‌న్నారు. ప్రస్తుత పాల‌కులు మెరిట్ క‌టాఫ్ పెట్టి పేద విద్యార్థుల‌కు చ‌దువు దూరం చేయాల‌ని చూస్తున్నార‌ని విమ‌ర్శించారు.

ఒకే కుటుంబానికి ఐదు ఉద్యోగాలు..

రాష్ట్రంలో ఒకే ఇంట్లో ఐదు ఉద్యోగాలు ఉన్నది కేసీఆర్ కుటుంబానికి మాత్రమేన‌ని ష‌ర్మిల తీవ్ర విమ‌ర్శలు చేశారు. తాను అధికారంలోకి వ‌స్తే నిరుద్యోగుల‌కు ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పిస్తాన‌ని ష‌ర్మిల హామీ ఇచ్చారు. గ‌తంలో వైఎస్సార్ ఒకేసారి 58 వేల డీఎస్సీ పోస్టులను భ‌ర్తీ చేశార‌న్నారు. అంతేకాకుండా ప్రైవేట్ సెక్టార్‌లో కూడా ల‌క్షల మందికి ఉద్యోగాలు క‌ల్పించిన ఘ‌న‌త వైఎస్సార్‌కు ద‌క్కింద‌ని గుర్తుచేశారు. అనంత‌రం ష‌ర్మిల అభిమానులు రూపొందించిన సంక‌ల్ప స‌భ‌ను విజ‌య‌వంతం చేయాల‌నే నేప‌థ్యంలో ఉన్న ఆడియోను ఆవిష్కరించారు.

Next Story

Most Viewed