అత్తింటి వేధింపులకు అల్లుడు బలి

by  |
giribabu suicide
X

దిశ, నల్లబెల్లి: అత్తింటి వేధింపులు భరించలేక అల్లుడు మృతిచెందిన సంఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని నందిగామ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. మృతుడి తల్లిదండ్రుల వివరాల ప్రకారం… నందిగామ గ్రామానికి చెందిన సంగ సమ్మయ్య-పద్మల కుమారుడు సంగా గిరిబాబు(28) ఇదే మండలంలోని రేలకుంట గ్రామానికి చెందిన కందగట్ల రమేష్-సుజాత కుమార్తె పావనిని ఏడాది క్రితం గిరిబాబు ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. మొదట నుండి వీరి పెళ్లిని వ్యతిరేకించిన అమ్మాయి తల్లిదండ్రులు ఓ పథకం ప్రకారం పెండ్లి చేశారు. అనంతరం తమ కూతురికి మాయమాటలు చెప్పి అల్లుడిని ఇంటికి రప్పించుకున్నారు. దీంతో గిరిబాబు అత్తమామల వద్దే ఉంటూ పనిచేయసాగాడు.

ఇదిలా ఉండగా గిరిబాబు ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఇది సాకుగా చూపుతూ అమ్మాయి తల్లిదండ్రులు విడాకులు ఇవ్వాలని గిరిబాబుపై ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో రెండ్రోజుల కిందట పెద్ద మనుషుల మధ్య పంచాయితీ కూడా పెట్టించారు. ఈ గొడవలో గిరిబాబు తండ్రి మాట్లాడుతూ.. తన కొడుకు గిరిబాబు జేసీబీతో ఇన్నాళ్లు సంపాదించిన డబ్బులు తన మామ రమేష్‌కు ఇచ్చాడని ఆరోపించారు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అతని అత్తామామలు డబ్బులు ఏమీ ఇచ్చేది లేదని, విడాకులు ఇవ్వాలని గిరిబాబుని దుర్భాష లాడారు. దీంతో అవాక్కైన గిరిబాబు, అత్తామామలతో పాటు భార్య కూడా తనను రోడ్డుమీదకు నెట్టేసరికి గిరిబాబు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. శనివారం తన వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు పరకాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం గిరిబాబు మృతి చెందాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ట్రైనీ ఎస్సై రామకృష్ణ తెలిపారు.

Next Story

Most Viewed