‘పది’ పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ

by  |
‘పది’ పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ
X

పదో తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి జిల్లా మినహా మిగతా జిల్లాల్లో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షలు రాయడానికి అనుమతి ఇవ్వాలని ఆదేశించింది. సప్లిమెంటరీ ఉత్తీర్ణులను కూడా రెగ్యులర్‌గా గుర్తించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

పదో తరగతి పరీక్షల నిర్వహణపై శనివారం ఉదయం హైకోర్టు విచారణ జరిపింది. జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి జిల్లాల్లో పటిష్ట జాగ్రత్తలు తీసుకున్నామని .. అక్కడ కూడా పరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం హైకోర్టును కోరింది. అయితే ప్రభుత్వ వాదనతో హైకోర్టు ఏకీభవించలేదు. ప్రస్తుతం జీహెచ్ ఎంసీ పరిధిలో కేసుల ఉద్ధృతి ఎక్కువగా ఉన్నందునా విద్యార్థులు మరణిస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారని హైకోర్టు ప్రశ్నించింది. పరీక్షల కన్నా విద్యార్థుల జీవితాలే ముఖ్యమని కోర్టు స్పష్టం చేసింది. దీంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో పరీక్షలు వాయిదా వేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.

రాష్ట్రంలో వేర్వేరుగా పరీక్షలు నిర్వహించడం కష్టమవుతుందని, మరలా ప్రశ్నా పత్రాలు తయారు చేయడం ఇబ్బందని అడ్వకేట్ జనరల్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమా లేక సాంకేతిక అంశాలు ముఖ్యమా అంటూ ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుత తీర్పుతో పదో తరగతి పరీక్షలకు లైన్ క్లియర్ అయింది.



Next Story