కష్టాలు గట్టెక్కిస్తున్న కందిసాగు.. మార్కెట్‌లో భలే డిమాండ్

by  |
kandi fammers
X

దిశ, తెలంగాణ బ్యూరో: మార్కెట్‌లో డిమాండ్ ఉన్నపంటలను సాగు చేయడం ద్వారా లాభాలు గడించవచ్చని ప్రభుత్వం రైతులను ఆ దిశగా ప్రోత్సహిస్తుంది. ఈ ఏడాది కంది, పత్తి పంటలను అధికంగా సాగు చేయాలని వ్యవసాయాధికారులచే విసృతంగా రైతులకు అవగాహనలు కల్పిస్తున్నారు. గతేడాది 14.09 లక్షల ఎకరాల్లో సాగు చేసిన కంది పంటను ఈ ఏడాది 25 లక్షల ఎకరాల్లో సాగుచేసేలా చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం విత్తన కంపెనీలకు ఆదేశాలు జారీ చేసి లక్ష క్వింటాళ్ల కంది విత్తనాలను సిద్ధం చేస్తున్నారు. మద్దతు ధర రూ.6000 ఉండగా అత్యధికంగా మార్కెట్‌లో రూ.6,629 వరకు గతేడాది రైతులు పొందగలిగారు. కందిపప్పుకు కూడా మార్కెట్‌లో కిలో రూ.105లతో డిమాండ్ ఉందటంతో కంది సాగు చేపట్టే రైతులు లభాలు గడించనున్నారు.

25 లక్షల ఎకరాల్లో కంది సాగు

నిత్యవసర సరుకుల్లో ప్రధానమైన కంది పంటను ఈ ఏడాది గరిష్టంగా సాగు చేపట్టేందుకు ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తుంది. రాష్ట్రంలో కంది సాధారణ సాగు విస్తీర్ణం 7,61,212 ఎకరాలుండగా గతేడాది 14.09 ఎకరాల్లో రైతులు సాగు చేపట్టారు. దీనికి రెట్టింపు స్థాయిలో ఈ ఏడాది 25 లక్షల ఎకరాల్లో కంది పంటను సాగుచేసేలా రైతులను సన్నద్దం చేస్తున్నారు. ఇందుకోసం లక్ష క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేయాల్సిందిగా రాష్ట్ర, జాతీయ విత్తనాభివృద్ది సంస్థలను, వ్యవసాయ విశ్వవిద్యాలయాలను, ఇతర ప్రైవేట్ కంపెనీలను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. మే 15 వరకు విత్తానాలను రైతులకు చేరే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

మద్దతు ధర మించి కంది కొనుగోళ్లు

కంది పంటకు ప్రభుత్వం గతేడాది క్వింటాళ్ కు రూ.6000లను నిర్ణయించి మార్కెట్ యార్డ్‌ల ద్వారా వివిధ కొనుగోలు కేంద్రాల పంటను కొనుగోలు చేశారు. కంది పంటకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండటంతో గతేడాది వానాకాలం సీజన్‌లో పండించిన కందిని ప్రైవేటు మార్కెట్ వ్యాపారులు మద్దతు ధరకు అధనంగా చెల్లించి కొనుగోలు చేపట్టారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌లో కంది పంట రికార్డు ధర పలికింది. ప్రైవేటు వ్యాపారులు జనగామ జిల్లా పాలకుర్తికి చెందిన రైతు నుంచి క్వింటాళ్ రూ.6629గా 20 బస్తాల పంటను కొనుగోలు చేశారు. మార్కెట్ కంది పప్పు కిలో రూ.105 ఉండటంతో ఈ ఏడాది కూడా కందులకు మంచి డిమాండ్ రానున్నాయి.

అడ్డంకులు అధిగమిస్తే అధిక దిగుబడులు

కంది పంటను రాష్ట్రంలో అధికంగా మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌, నల్గొండ, వరంగల్‌, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తారు. కంది పంట చివర దశలో బెట్టకు గురికావడం వలన చాలా వరకు దిగుబడులు తగ్గిపోతున్నాయి. తెగుళ్ళు(ఎండు,వెర్రి తెగుళ్ళు) పురుగులు (కాయ తొలుచు పురుగు, శనగపచ్చ పురుగు) చీడ పీడల వలన పంటకు నష్టం కలుగుతుంది. కంది మిశ్రమ పంటగా పండించినప్పుడు అంతర పంటను కోసిన తరువాత కందిని అశ్రద్ద చేయడం వలన దిగుబడులు తగ్గే అవకాశాలున్నాయి. వ్యవసాయాధికారుల, శాస్త్ర వేత్తల సూచనలు సలహాలు పాటించి అడ్డంకులను అధిగమిస్తే అధిక దిగుబడులను పొందవచ్చు. వానాకాలం సీజన్‌లో సాగుచేసే కంది 170-180రోజుల్లో పంట చేతికి వస్తుంది. పంట యాజమాన్య పద్దతులను పాటిస్తూ సాగుచేస్తే ఎకరానికి 8-10 క్వింటాళ్ళ దిగుబడివచ్చే అవకాశాలున్నాయి. వర్షాపాతాలు తక్కవగా నమోదయ్యే ప్రాంతాల్లో తొలకరితో పంటను పండించుకునేందుకు నీరు త్వరగా ఇంకిపోయే గరప నేలలు ఎర్రరేగడి నేలలు, చల్కానేలలు, నల్లరేగడి నేలల్లో రైతులు ఎక్కవగా కందిని సాగుచేస్తారు.


Next Story

Most Viewed