టీఆర్ఎస్ ‘గెలుపు’ అంత ఈజీ కాదు..

by  |
టీఆర్ఎస్ ‘గెలుపు’ అంత ఈజీ కాదు..
X

దిశ ప్రతినిధి, హైద‌రాబాద్ : మ‌హ‌బూబ్ న‌గ‌ర్, రంగారెడ్డి, హైద‌రాబాద్ ప‌ట్టభ‌ద్రుల ఎమ్మెల్సీ నియోజ‌క‌వ‌ర్గంలో విజ‌యం సాధించేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ ఆప‌సోపాలు ప‌డుతోంది. గ‌తంలో ఎన్నడూ లేని విధంగా టీఆర్ఎస్‌కు గ‌డ్డు ప‌రిస్థితి నెల‌కొంది. ఓ వైపు నిరుద్యోగులు, మ‌రోవైపు ఉద్యోగులు అధికార పార్టీపై గుర్రుగా ఉన్నారు. జాబ్ నోటిఫికేషన్లు లేక యువ‌త , స‌మ‌స్యలు ప‌రిష్కారం కాక ఉద్యోగులు టీఆర్ఎస్ పార్టీని దూరంగా పెడుతున్నారు. సాధార‌ణ ఎన్నిక‌ల‌కు, ప‌ట్టభ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు చాలా తేడా ఉంది. ఈ ఎన్నిక‌ల్లో ఓట‌ర్లు చ‌దువులో ప‌ట్టాలు పుచ్చుకున్నవారు కాగా.. సాధార‌ణ ఎన్నిక‌ల‌లో 18ఏండ్ల పై బ‌డిన వారంతా ఎన్నిక‌ల్లో ఓటు వేసేందుకు అర్హుల‌న్న విష‌యం తెలిసిందే. గ్రామాల్లో నిరక్షరాస్యుల‌ను పోలింగ్ బూత్ వ‌ర‌కు తీసుకుపోవ‌డం చాలా సులువు. కానీ ప‌ట్టభ‌ద్రుల నుండి ఓటు పొంద‌డం అంత సులువు కాదు. వారు విజ్ఞత‌తో ఆలోచించి ఓటు వేస్తారు. ఇది అధికార పార్టీకి తంటాలు తెచ్చిపెట్టింది. దుబ్బాక ఉప ఎన్నిక‌లో పార్టీ ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి అకాల మ‌ర‌ణంతో వ‌చ్చిన సానుభూతి కూడా పార్టీని గ‌ట్టెక్కించ‌లేక‌పోయింది. అనూహ్యంగా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ పాగా వేసింది. అనంత‌రం జ‌రిగిన జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ విజ‌యం ముంగిట బొక్క బోర్ల ప‌డింది. దీంతో చివ‌రి నిమిషం వ‌ర‌కు మేయ‌ర్ ప‌ద‌వి ఎవ‌రిని వ‌రిస్తుంద‌నేది తెలియ‌కుండా పోయింది. ఈనేప‌థ్యంలో వ‌చ్చిన ప‌ట్టభ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ ఎదురీదుతోంది.

కీల‌కంగా మార‌నున్న ఓట్లు ..

ప‌ట్టభ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప‌ట్టభ‌ద్రులైన నిరుద్యోగుల ఓట్లు కీల‌కంగా మారనున్నాయి. ఏండ్లు గ‌డుస్తున్నా పీఆర్సీ ప్రక‌ట‌న లేక‌పోవ‌డం, ఉద్యోగుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సు పెంచ‌క‌పోవ‌డం, నూత‌న నియామ‌కాలు ఆశించిన మేర లేక‌పోవ‌డం వంటివే కాకుండా అనేక స‌మ‌స్యలు ఉద్యోగుల‌ను వేధిస్తున్నాయి. ఇదే స‌మ‌యంలో ఉపాధ్యాయులు వేరు, ఉద్యోగులు వేరంటూ సీఎం ప్రకట‌న చేయ‌డ‌మే కాకుండా వారికి బ‌దిలీలు, ప‌దోన్నతులు కల్పించ‌లేదు. దీంతో వారు ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు ఎంత‌మేర‌కు వేస్తార‌నేది ప్రశ్నార్ధకంగా మారింది. వీరే కాకుండా నిరుద్యోగ ప‌ట్టభ‌ద్రుల ఓట్లు కూడా ఎన్నిక‌లలో గెలుపు, ఓట‌ముల‌ను శాసించే విధంగా ఉండ‌డంతో టీఆర్ఎస్ పార్టీకి ఇర‌కాటంగా మార‌నుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇవే జ‌రిగితే టీఆర్ఎస్‌కు మ‌హ‌బూబ్ న‌గ‌ర్,రంగారెడ్డి, హైద‌రాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక‌లు మ‌రో చేదు అనుభ‌వం మిగిల్చే అవకాశం ఉందనే చర్చ కొనసాగుతోంది.

అంద‌ని ద్రాక్షగా..

మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల స్థానాన్ని మరోసారి తానే కైవసం చేసుకుంటానన్న ధీమాతో ఎమ్మెల్సీ రామచంద్రరావు ఉండ‌గా ఇది అధికార టీఆర్ఎస్‌కు మింగుడు ప‌డ‌డం లేదు. గతంలో ఈ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఉద్యోగ సంఘాల నేత దేవీ ప్రసాద్ ఓటమి చెందిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంత‌రం ఎన్నో విజయాలు నమోదు చేసుకున్న టీఆర్ఎస్.. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల స్థానాన్ని మాత్రం ఇంతవరకూ గెలుచుకోలేకపోయింది. తాజా ఎన్నిక‌ల్లో బీజేపీ, కాంగ్రెస్, టీడీపీల‌తో పాటు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెస‌ర్ నాగేశ్వర్‌తో క‌లిపిమొత్తం 93 మంది ఎన్నిక‌ల బ‌రిలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ 2007, 2009 ఎన్నిక‌ల‌లో గెలిచి.. 2014 వరకు ఎమ్మెల్సీగా వ్యవహరించారు. 2014లోజ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీ కైవ‌సం చేసుకుంది. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గెలుపు అంత సులువు కాక‌పోగా.. టీఆర్ఎస్‌కు అంద‌ని ద్రాక్షగా మారింద‌నే అభిప్రాయాలు అంత‌టా విన్పిస్తున్నాయి.


Next Story

Most Viewed