సినిమా థియేటర్లలో లవర్స్‌ పడరాని పాట్లు..

by  |
సినిమా థియేటర్లలో లవర్స్‌ పడరాని పాట్లు..
X

దిశ, వెబ్‌డెస్క్ : చూశారా.. కరోనా ఎంత పని చేసిందో.. మనుషులనే కాదు.. కూర్చునే సీట్లను కూడా కట్టిపడేసింది. మనుషుల మధ్య ఎడబాటును పెంచింది. కుటుంబ సభ్యులను సైతం విడదీసింది. కరోనా సృష్టించిన కల్లోలానికి ఈ చిత్రాలే నిదర్శనం. తొమ్మిది నెలలు వినోదాన్ని దూరం చేసిన ఈ వైరస్.. కాస్త తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే సినిమా థియేటర్లు తెరుచుకుంటున్నాయి. ప్రభుత్వం విధించిన కొవిడ్ నిబంధనలతో థియేటర్ యజమానులు ఇలా సీటును విడిచి మరో సీటును ప్రేక్షకులకు కేటాయిస్తున్నారు. మధ్య ఉన్న సీట్లల్లో ఎవరూ కూర్చోకుండా తాళ్లతో సీల్ చేస్తున్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కిశోర్ థియేటర్‌లో ఇలా కుర్చీలకు తాళ్లుకట్టి ప్రేక్షకులకు అనుమతినిచ్చారు. కానీ కుటుంబ సమేతంగా మూవీకి వెళ్లిన వారు అసౌకర్యానికి గురవుతున్నట్లు వాపోతున్నారు. థియేటర్ కార్నర్ లో కూర్చొనే లవర్స్‌కు సైతం ఎడబాటు తప్పకపోవడంతో వారి నిట్టూర్పులు అన్నీఇన్నీ కావు. ఏదిఏమైనా ఆటవిడుపును కూడా అడ్డుకుంటోందీ కరోనా..!

సుదీర్ఘ విరామం తర్వాత సూర్యాపేటలో సినిమా థియేటర్లు తెరుచుకున్నాయి. శుక్రవారం కిషోర్ థియేటర్‌లో ‘సోలో బ్రతుకే సో బెటర్’మూవీ రిలీజ్ అయింది. అయితే ఈ థియేటర్‌లో 712 సీట్ల కెపాసిటీ ఉండగా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సీటు విడిచి సీటు ఏర్పాటు చేసి 356 సీట్లకే పరిమితం చేశారు. థియేటర్లలో శానిటైజ్ చేయడంతోపాటు ప్రేక్షకులు వ్యక్తిగత దూరాన్ని పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని మేనేజర్ గుర్రం వెంకటరెడ్డి తెలిపారు. ప్రేక్షకులు కూడా థియేటర్ లో ఉమ్మి వేయకుండా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.



Next Story