ఆదివాసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి : ఎస్పీ వైవీ సుధీంద్ర

by  |
ఆదివాసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి : ఎస్పీ వైవీ సుధీంద్ర
X

దిశ, ఆసిఫాబాద్ : ఆదివాసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని జిల్లా ఎస్పీ వైవీ సుధీంద్ర ఆకాంక్షించారు. మంగళవారం కొముర్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని అత్యంత మారుమూల గ్రామమైన పంగిడి మాదరలో తిర్యాణి పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుమూల మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన పంగిడి మాదర పరిసర ఆదివాసీ గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు పోలీసులు కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే తిర్యాణి పోలీసుల ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ వైద్య శిబిరాన్ని గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అసాంఘిక శక్తులకు గిరిజన ప్రజలు దూరంగా ఉండాలని కోరారు.

ఎవరికి ఎలాంటి సమస్యలు వచ్చినా పోలీసుల దృష్టికి తీసుకుని వస్తే తమ వంతు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అనంతరం నిర్వహించిన వైద్య శిబిరంలో మంచిర్యాల హెల్త్ కేర్ హాస్పిటల్ నుంచి వచ్చిన 8 మంది వైద్యులు 500 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందచేశారు. అలాగే చిరాగ్ ఫౌండేషన్ (అమెరికా)సాకేత్ ఆలూరి సహకారంతో పంపించిన 300 రగ్గులను 10 గ్రామాల్లోని ఆదివాసీ వృద్దులకు అందచేశారు. కార్యక్రమములో ఆసిఫాబాద్ డీఎస్పీ ఆర్ శ్రీనివాస్, తిర్యాణి ఎస్సై పి. రామారావు, పంగిడి మాదర, మర్కగూడ, భీంజీ గూడ, మందగూడ సర్పంచ్‌లు, జగనక జంగు, బొజ్జిరావు, చిన్నరాజులు, తుమ్రం శ్రేదేవి, ఎంపీటీసీ కేశవ్, మాజీ సర్పంచులు రాధ, గోపాల్, హెల్త్ కేర్ వైద్యులు ఆంజనేయులు, అరుణ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed