బ్రిడ్జి నిర్మించకపోతే ఓట్లు వేయం.. ఆందోళనకు దిగిన గిరిజనులు

by  |
బ్రిడ్జి నిర్మించకపోతే ఓట్లు వేయం.. ఆందోళనకు దిగిన గిరిజనులు
X

దిశ, ఖానాపూర్: నిర్మల్ జిల్లా పెంబి మండల పరిధిలో యపలగూడ-రాంనగర్-షెట్‎పల్లి, హనిగూడ, జంగన్‎గూడ గిరిజన గ్రామలు ఏర్పడి 50 సంవత్సరాలు గడుస్తున్నా.. వారికి సరైన రహదారులు లేక నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మాత్రం మారడం లేదంటూ గిరిజన గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే గురువారం యపలగూడ గ్రామస్తులు దొత్తి వాగులో మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ప్రజలు పెంబి మండలానికి వెళ్లాలంటే దొత్తి వాగు దాటాల్సిందేనని.. కానీ, బ్రిడ్జి సదుపాయం లేక నీటిలో నుంచి రాకపోకలు చేయడం ఇబ్బంది అవుతోందంటున్నారు.

ఇక వర్షాకాలంలో అయితే వాగు ఉప్పొంగడంతో గ్రామలకే పరిమితమవుతున్నామంటున్నారు. ఈ సమయంలో విష జ్వరాలు సోకి మండలానికి వెళ్లే దారి లేక ప్రజలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను స్కూల్‌కి పంపాలంటే భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయని వాపోతున్నారు. చివరకు పండించిన పంటను కూడా ఎక్కడ అమ్ముకోవాలో తెలియక.. దళారుల చేతిలో పెట్టి నష్టపోతున్నామని చెబుతున్నారు. కనీసం ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి దొత్తి వాగుపై బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయకుండా.. ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు.



Next Story

Most Viewed