జీహెచ్ఎంసీలో రూ.10వేలు ఇయ్యనోడు.. పదిలక్షలు ఎలా ఇస్తడు : రేవంత్ రెడ్డి

by  |
Revanth-reddy
X

దిశ, జమ్మికుంట : ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు చెప్పేవి తాగుబోతుల మాటలని, వారు చెప్పేది ఒకటని, చేసేది మరొకటని టిపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పిన కేసీఆర్ వాటిని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. హుజురాబాద్ ఉపఎన్నికలు ఇద్దరు తోడు దొంగల మధ్య జరుగుతున్నాయన్నారు.

ఈటల రాజేందర్ అవినీతికి పాల్పడ్డాడని చెబుతున్న హరీష్ రావు‌కు సిగ్గు ఉండాలని, 20 ఏళ్ల పాటు ఒకే కంచంలో తిని, ఒకే మంచంలో పడుకున్న చందంగా మెదిలినప్పుడు ఏం చేసావని ప్రశ్నించారు. 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ పార్టీ నెరవేర్చలేదని ఉపఎన్నికల సందర్భంగా ఇస్తున్న హామీలు కూడా ప్రభుత్వం నెరవేర్చదని ఘాటుగా విమర్శించారు. పట్నంలో భారీ వర్షాలకు అనేక కాలనీలో నీట మునిగిపోతే, కొందరికి మాత్రమే రూ.10 వేలు ఇచ్చి మిగతా వారికి ఎన్నికల అనంతరం ఇస్తానని చెప్పారని.. తీరా జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసాక ఆ మాట ఎత్తలేదన్నారు.

రూ.10 వేలు ఇయ్యనోడు రూ.10 లక్షలు ఎలా ఇస్తాడని ప్రశ్నించారు. ఢిల్లీలో మోడీ, కేసీఆర్ ఒకటే అని.. హుజురాబాద్‌లో మాత్రం ఈటల రాజేందర్, హరీష్ రావులు కొట్లాడుకుంటున్నారని విమర్శించారు. కార్యక్రమంలో ఎన్నికల ఇన్చార్జి దామోదర రాజనరసింహ, మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్, డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మక్కాన్ సింగ్, సిరిసిల్ల రాజయ్య, విజయ రమణారావు, ఈర్ల కొమురయ్య, ప్రతి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed