కేసీఆర్‌ ఆ సంతకం ఎందుకు పెట్టారో చెప్పాలి.. రేవంత్ డిమాండ్

by  |
TPCC Chief Revanth Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: కృష్ణా జలాల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం గాంధీ భవన్‌లో రేవంత్ మీడియాతో మాట్లాడుతూ… గత ఆరేళ్లుగా కృష్ణ జలాలపై మాట్లాడకుండా కేసీఆర్ దగా చేస్తున్నారని విమర్శించారు. ఏపీ-తెలంగాణ రాష్ట్రాలకు కృష్ణా జలాల్లో 50-50 శాతం కేటాయించే విధంగా పోరాడతామని ప్రగల్భాలు పలికి కేవలం 34 శాతానికి ఎందుకు సంతకం పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విధంగా టీఆర్ఎస్ ఎంపీలు ఎలాంటి పోరాటం చేయలేదని గుర్తుచేశారు. పార్లమెంట్‌లో కేంద్రం తెచ్చిన బిల్లులకు టీఆర్ఎస్ ఎంపీలు సపోర్ట్ చేసి రాష్ట్రానికి వచ్చి వాటిని వ్యతిరేకించామని చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

బుధవారం జరిగిన కేఆర్ఎంబీ మీటింగ్‌కి సీఎం కేసీఆర్ హాజరవకుండా విందులో పాల్గొన్నారని, ఆయనకు రాష్ట్ర ప్రజల కంటే పార్టీయే ముఖ్యమా? అని ప్రశ్నించారు. రాష్ట్ర హక్కులను కాపాడుకోవడానికి సీఎం ఎలాంటి ప్రయత్నం చేయలేదని, మన అధికారులు కూడా మీటింగ్‌లో వారి వాదనలు వినిపించడంలో విఫలమయ్యారని ధ్వజమెత్తారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల హక్కులను ఏపీ సీఎం జగన్‌కు తాకట్టు పెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో 70 శాతం కృష్ణానది ప్రవహిస్తోందని, నీటి హక్కుల కోసం ఎందుకు పోరాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతోందని నాగం జనార్ధన్ రెడ్డి గతంలోనే కేంద్రానికి లేఖ రాసిన పట్టించుకోలేదని గుర్తుచేశారు.

Next Story

Most Viewed