తెలంగాణ.. కేసీఆర్ జాగీర్ కాదు !

by  |
తెలంగాణ.. కేసీఆర్ జాగీర్ కాదు !
X

దిశ, న్యూస్‌బ్యూరో:

అధికారంలో ఉన్నంత మాత్రాన రాష్ట్రం కేసీఆర్ జాగీర్ కాదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌ ‌రెడ్డి హెచ్చరించారు. అడ్డగోలుగా రాష్ట్ర ప్రజల సొమ్ము దోచుకొని, అహంకారంతో నోటికొచ్చినట్లు మాట్లాడితే పడేందుకు రాష్ట్ర ప్రజలు కేసీఆర్ బానిసలు కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. బుధవారం గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తమ స్థాయిని మరిచి మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా కరోనా వైరస్ పారసిటమాల్ గోలితో పోతుందన్న వాళ్లే దద్దమ్మలు, బఫూన్లు అని ఎద్దేవా చేశారు. గవర్నర్‌ను కలిస్తే కేసీఆర్ ఎందుకు ఇబ్బంది పడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. గవర్నర్ హక్కులను సైతం కేసీఆర్ అవమానిస్తున్నారని తెలిపారు.

మార్చి నెలలో కాంట్రాక్టర్లకు నిధులిచ్చి ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు వేతనాల్లో కోత విధించడంపై ప్రభుత్వాన్ని ఉత్తమ్ నిలదీశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రా కాంట్రాక్టర్లు ఎందుకని ప్రశ్నించారు. ప్రతీ ఇంటికి భగీరథ నీళ్లు ఇవ్వకుండా ఓట్లు అడగనని.. ఆ తర్వాత మాట నిలబెట్టుకోని వారే సన్నాసులు, దద్దమ్మలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో రైతుల పంట రుణాలన్నీ మాఫీ అయ్యాయని తెలిపారు. ఛత్తీస్‌గడ్‌లో కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు అదనంగా బోనస్ కలిపి వరి ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.2500 చొప్పున కొనుగోలు చేస్తోందన్నారు. కేసీఆర్‌కు దమ్ముంటే ఛత్తీస్‌గడ్, రాజస్థాన్ ప్రాంతాలకు మాతో రావాలని ఉత్తమ్ సవాల్ విసిరాడు. ధాన్యం కొనుగోళ్లలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందన్నారు. తేమ, తాలు పేరుతో కిలోలకు కిలోలు కోతలు విధిస్తున్నారని ఆందోళన చేసిన రైతులను.. ‘తాలు రైతులు’ అన్న సీఎం యావత్ రైతాంగాన్ని అవమానించారన్నారు. రెడ్ జోన్లలో వైన్ షాపులు తప్ప మరే దుకాణాలు తెరవద్దని చెప్పడానికి సీఎం కేసీఆర్‌కి సిగ్గుండాలన్నారు. బత్తాయి ఆరోగ్యానికి మంచిదని చెప్పిన కేసీఆర్.. ఎందుకు బత్తాయి కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. బత్తాయి పంటను నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్రజలకు రేషన్ మాదిరిగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాలు పేరుతో బ్యాగుకు నాలుగు కిలోలు కోత విధిస్తున్నారని, రైతుల గోస ఊరికే పోదని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం మాదిరిగా ఏ రాష్ట్రంలో రైతుల మీద కేసులు పెట్టారో కేసీఆర్ చెప్పాలన్నారు. దమ్ముంటే కరీంనగర్ జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు మీ మంత్రులు గానీ మీరు గానీ వస్తే రైతుల బాధేమిటో చూపిస్తానని ప్రభాకర్ కేసీఆర్‌కు సవాల్ విసిరాడు.

Tags: Congress, Uttam, KCR, Marketing, Paddy, farmers, Governor



Next Story

Most Viewed