టోక్యో ఒలంపిక్స్.. అన్నీ కుదింపే

by  |
Tokyo olympics
X

దిశ, స్పోర్ట్స్: కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటికే ఏడాది వాయిదా పడిన ఒలింపిక్స్ 2020కి మరో 8 వారాలే సమయం ఉన్నది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్ సెకెండ్ వేవ్ తీవ్రంగా ఉన్నది. ముఖ్యంగా ఆసియా ప్రాంతంలో ఈ వైరస్ ప్రభావం కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధాలు ఉన్నాయి. జపాన్‌లో కూడా వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో టోక్యో సహా ఇతర ప్రధాన నగరాల్లో ఎమర్జెన్సీని పొడిగించారు. మరోవైపు కరోనా కష్టకాలంలో ఒలింపిక్స్ నిర్వహించవద్దంటూ టోక్యోలోని నేషనల్ స్టేడియం వెలుపల ఇటీవల నిరసన కార్యక్రమాలు కూడా జరిగాయి.

మరోవైపు ఎన్ని ఆటంకాలు ఎదురైనా మెగా క్రీడలు ఆగవని.. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించి తీరతామని టోక్యో ఒలింపిక్ కమిటీ, అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ స్పష్టం చేశాయి. అవసరమైన రక్షణ చర్యలు తీసుకుంటున్నామని.. ఇప్పటికే పూర్తి వ్యూహం సిద్దం చేశామని నిర్వాహక కమిటీలు చెబుతున్నాయి. జపాన్ ప్రభుత్వం కూడా ఈ మెగా ఈవెంట్ నిర్వహించడానికే మొగ్గు చూపుతున్నది. రూ. వేల కోట్లు ఖర్చు చేసి స్టేడియంలు, ఒలింపిక్ విలేజ్, ఇతర సౌకర్యాలు కల్పించిన అనంతరం.. ఇప్పుడు అకస్మాత్తుగా క్రీడలను రద్దు చేయలేమని చెబుతున్నది.

అన్నింటా కుదింపు..

టోక్యో ఒలింపిక్స్‌కు దాదాపు 15 వేల మంది అథ్లెట్లు వస్తున్నారు. వీరి సంఖ్యను తగ్గించలేరు. కానీ వీరితో పాటు పలు దేశాల నుంచి మ్యాచ్ అఫీషియల్స్, కోచ్‌లు, సహాయక సిబ్బంది టోక్యో వచ్చే అవకాశం ఉన్నది. అన్ని దేశాల నుంచి దాదాపు 1,80,000 మంది మ్యాచ్ అఫీషియల్స్ వివిధ దేశాల నుంచి ఒలింపిక్స్‌కు రానున్నట్లు కమిటీ అంచనా వేసింది. వీరి సంఖ్యలను 60 శాతం మేర తగ్గించేయాలని నిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకున్నది. కేవలం 80 వేల నుంచి 90మ వేల మంది వరకు మాత్రమే అనుమతించాలని నిర్ణయించినట్లు ఒలింపిక్ కమిటీ సీఈవో ప్రకటించారు.

ఇప్పటికే నిర్వాహక కమిటీ ఆయా దేశాల ఒలింపిక్ కమిటీలకు ఆ మేరకు సమాచారం అందించింది. ‘మీ దేశాల నుంచి టోక్యోకు పంపే మ్యాచ్ అఫీషియల్స్ సంఖ్యను తగ్గించండి. అవసరమైన మేరకే అతి కొద్ది మందిని మాత్రమే టోక్యోకు పంపండి’ అని లేఖ రాసింది. అంతే కాకుండా కోచ్, సహాయక సిబ్బంది విషయంలో కూడా సరైన నిర్ణయం తీసుకోవాలని.. జంబో టీమ్స్‌ను టోక్యో పంపవద్దని కోరింది. అథ్లెట్ల వ్యక్తిగత సిబ్బందిని దాదాపు ఆపేయాలని.. అత్యవసరం అనుకున్న వారినే పంపాలని నిర్వాహక కమిటీ స్పష్టం చేసింది.

ఖాళీ స్టేడియంలే దిక్కా?

కరోనా కారణంగా విదేశీ ప్రేక్షకులను అనుమతించడం లేదని ఇప్పటికే ఒలింపిక్ నిర్వాహక కమిటీ స్పష్టం చేసింది. ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన దాదాపు 2 లక్షల మంది విదేశీ ప్రేక్షకుల రుసుం వెనక్కు ఇస్తామని ప్రకటించింది. మరోవైపు ప్రస్తుతానికి 50 శాతం స్వదేశీ ప్రేక్షకులను అనుమతిస్తున్నారు. కాగా, రానున్న రోజుల్లో కరోనా మరింత విస్తృతంగా వ్యాపిస్తే స్వదేశీ ప్రేక్షకులపై కూడా నిషేధం విధించే అవకాశం ఉన్నది. ఒలింపిక్స్ మొత్తాన్ని ఖాళీ స్టేడియంలలో నిర్వహించడానికి కూడా వెనుకాడబోమని నిర్వాహక కమిటీ చెప్పింది.

ప్రస్తుతం భారత పౌరులు జపాన్‌లో అడుగుపెట్టడంపై నిషేధం ఉన్నది. దీంతో ఇండియన్ అథ్లెట్లు టోక్యో చేరుకోవడంపై సందేహాలు నెలకొన్నాయి. కాగా, శుక్రవారం దీనిపై ఇండియన్ ఒలింపిక్ కమిటీ చీఫ్ నరేంద్ర బత్రా స్పందించారు. ఇండియా, పాకిస్తాన్, నేపాల్ దేశాలపై జపాన్ నిషేధం విధించిన మాట వాస్తవమే.. అయితే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఈ మూడు దేశాల అథ్లెట్లపై మాత్రం ఎలాంటి నిషేధం ఉండదని స్పష్టం చేసిందన్నారు. ముందుగానే జపాన్ వెళ్లి క్వారంటైన్‌లో ఉండనున్నట్లు ఆయన తెలిపారు. కాబట్టి భారత అథ్టెట్లు ఈ విషయంలో ఆందోలన చెందాల్సిన అవసరం లేదన్నారు.


Next Story