పెద్ద పెద్ద ఆస్పత్రులున్నా… ఎమ్మెల్యేను కాపాడుకోలేకపోయాం

by  |
పెద్ద పెద్ద ఆస్పత్రులున్నా… ఎమ్మెల్యేను కాపాడుకోలేకపోయాం
X

దిశ, దుబ్బాక: ప్రజాస్వామిక చింతన కలిగిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి లాంటి నాయకున్ని కోల్పోవడం బాధాకరమని, ఆయన మరణ వార్త తనను ఎంతో కలచివేసిందని టీజేఎస్ అధినేత, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. రామలింగారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. బుధవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కుటుంబాన్ని కోదండరాం పరామర్శించారు.

అనంతరం రామలింగారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన రామలింగారెడ్డి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… 1990వ సంవత్సరం నుంచి రామలింగారెడ్డితో నాకు మంచి పరిచయం ఉండేదన్నారు. అంతమంచి నాయకుడు ఒక చిన్న సమస్యతో మృతిచెందడం చాలా బాధాకరం అన్నారు. పెద్ద పెద్ద ఆసుపత్రులున్న ఈ రోజుల్లో ఎంతో పెద్ద పెద్ద రోగాలు నయం చేసే డాక్టర్లు ఉన్నప్పటికీ, ఒక ఎమ్మెల్యేకు చిన్న ఆరోగ్య సమస్య ఏర్పడితే కాపాడుకోలేకపోయామని బాధపడ్డాడు.

మనిషిని బతికించుకునే అవకాశం ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తు బతికించుకోలేక పోయామన్నారు. నేను పౌరహక్కుల సంఘంలో పనిచేస్తున్న క్రమంలో రామలింగారెడ్డి జర్నలిస్ట్‌గా ఉంటూనే, మా కార్యకలాపాలకు తోడ్పాటు అందించే వారని గుర్తు చేశారు. ఏదిఏమైనా ఒక ప్రజాస్వామిక చింతన కలిగిన నాయకున్ని కోల్పోవడం బాధాకరమన్నారు. వారు లేని లోటు వారి కుటుంబ సభ్యులకే గాక, దుబ్బాక నియోజక వర్గ ప్రజలకు, రాష్ట్రానికి తీరనిదన్నారు.

Next Story