రైతులకు సంకెళ్లపై మూడు రోజులపాటు నిరసనలు

by  |
Chandrababu naidu
X

దిశ, ఏపీ బ్యూరో: రాజధానికి భూములిచ్చిన దళిత, బీసీ రైతులకు బేడీలు వేయడాన్ని నిరసిస్తూ జేఏసీ ఇచ్చిన మూడురోజుల ఆందోళనలు, నిరసనకు సంఘీభావం తెలియ జేస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ఓ ప్రటనలో తెలిపారు. రైతు, ప్రజాసంఘాలు నిర్వహించే ఆందోళనలకు తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతిస్తూ కార్యక్రమాల్లో భాగస్వామి అవుతుందని పేర్కొన్నారు. వరదల్లో నష్టపోయిన రైతులను ఆదుకోకపోవడం, ఇన్‌పుట్ సబ్సిడీ అందించకపోవడం, పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టడం, రైతులపై తప్పుడు కేసులు పెట్టి వేధించడంలాంటి ప్రజా, రైతు కంటక ప్రభుత్వ నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. దీనిపై గురువారం ప్రభుత్వాధికారులకు వినతి పత్రాలు సమర్పించాలని, శుక్రవారం అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో అంబేద్కర్, మహాత్మాగాంధీ​ విగ్రహాల వద్ద నిరసన చేపట్టాలని పార్టీ యంత్రాంగానికి పిలుపునిచ్చారు. శనివారం ‘ఛలో గుంటూరు జిల్లా జైలు’ కార్యక్రమం నిర్వహించాలని కోరారు.


Next Story