కట్టు దాటలే, వైరస్ రాలే.. కరోనా ఫ్రీ గ్రామాలు ఇవే..

by  |
corona free villages
X

దిశ ప్రతినిధి, మెదక్ : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ దాదాపు ప్రతి గ్రామానికి చేరింది. ప్రతి గ్రామంలో వంద మందికి పైనే కరోనా బారిన పడ్డారు. ఇలాంటి విపత్కర పరిస్థితులల్లో కూడా కరోనా వైరస్ అంటే తెలియని గ్రామాలున్నాయంటే నమ్ముతారా..? కానీ ఇది నిజం. ఉమ్మడి మెదక్ జిల్లాలోని టెక్మాల్ మండలం సీఎంతండా, రామాయంపేట మండలంలోని గంగ్యానాయక్ తండా. కరోనా బారిన పడకుండా ఆ గ్రామాల ప్రజలు తీసుకుంటున్న చర్యలపై ‘దిశ’ ప్రత్యేక కథనం…

ఊరిని వదిలి వెళ్లరు…

మెదక్ జిల్లాలోని టెక్మాల్ మండలం సీఎంతండా, రామాయంపేట మండలంలోని గంగ్యానాయక్ తండా గ్రామ ప్రజలకు కరోనా అంటేనే తెలియదు. ఆ తండాల్లో నివసిస్తున్న వారందరూ ప్రధానంగా వ్యవసాయ రంగం పైనే ఆధారపడి జీవిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మెదక్, రామయంపేట పట్టణాలకు వెళ్లాలంటే బైక్ పైనే వెళ్తారు. వెళ్లేటప్పుడు మాస్క్, భౌతిక దూరం తప్పనిసరిగా పాటిస్తారు. ఊర్లోకి తమ బంధువులను సైతం రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకున్నారు.ఆ ఊర్లలో నివసిస్తున్న వారు అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు తింటున్నారు. కరోనా మొదటి దశలోనూ, రెండో దశలోనూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

కరోనా ఎందుకు దరి చేరదంటే..

గతంలో వేర్పుగొండ గ్రామ పంచాయతీ పరిధిలో సీఎంతండా ఉండేది. ఇప్పుడు పంచాయతీగా మారింది. టెక్మాల్ మండలం చెరువు ముందరితండా( సీఎం తండా) లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఇక్కడ వంద ఇండ్లు ఉంటే .. 580 మంది జనాభా ఉన్నారు. గ్రామ పంచాయతీగా మారిన తరువాత సీఎంతండాను సమిష్టి కృషి అభివృద్ధి చేసుకుంటున్నారు. కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో పంచాయతీ పాలకవర్గం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించేలా చేసింది. గ్రామ కట్టుబాట్లను అందరూ పాటిస్తున్నారు. ఇంట్లో ఉన్నా … పొలం పనులకు వెళ్లిన ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తున్నారు. గ్రామంలో పంచాయతీ పాలకవర్గం తరచూ శానిటైజ్ చేయిస్తోంది.

ఈ విషయంపై సీఎం తండా సర్పంచ్ రంజా నాయక్ ని ఇది ఎలా సాధ్యమైందని అడగ్గా.. అటవీ ప్రాంతంలో నివసించే మాకు కరోనా రాదనే అనుకుంటున్నాం. సోడియం హైపోక్లోరైట్ తో శానిటైజ్ కూడా చేయిస్తున్నాం. పొద్దంతా వ్యవసాయ పనుల్లో మునిగి తేలుతాం. ఏదైనా అందరం కలిసే నిర్ణయం తీసుకుంటాం. గ్రామంలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపడుతున్నాం అన్నారు.

గంగ్యా నాయక్ తండాలోనూ అదే విధానం..

రామాయంపేట మండలం గంగ్యా నాయక్ తండాలో ఇప్పటి వరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా వెలుగు చూడలేదు. కిషన్ నాయక్ తండా పరిధిలో ఉన్న అతి చిన్న తండా ఇది. ఇక్కడ అందరూ వ్యవసాయ బావుల దగ్గరే నివసిస్తారు. గంగ్యా నాయక్ తండాలో 16 కుటుంబాలున్నాయి. 86 మంది జనాభా ఉంటారు. ఇక్కడ అందరూ వ్యవసాయం పైనే ఆధారపడి బతుకుతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రమ జీవనాన్నే కొనసాగిస్తారు.



Next Story

Most Viewed