భర్త దుబాయ్ వెళ్లాడని భార్య జల్సా.. ఆ రాత్రి ఆరుగురు కలిసి..!

by  |
Wife Illegal Affair
X

దిశ, మేళ్లచెరువు : భార్య సుఖంగా ఉండాలని పరితపించిన భర్తను ఖతం చేసిందో ఇల్లాలు. తన కోసమే కష్టపడిన భర్తను ప్రియుడి మోజులో పడి కడతేర్చింది. రెండు క్షణాల ఆనందం కోసం ఏడడుగులు వేసిన పతి దేవుడినే సుపారీ ఇచ్చి చంపేసిందీ కామ పిశాచి. సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలను కోదాడ డీఎస్పీ రఘు మీడియాకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం..

kodad dsp Raghu

మేళ్లచెరువు మండలం కప్పలకుంటతండాకు చెందిన బాలాజీ, బుజ్జి దంపతులు. తాపీ పని చేసుకునే బాలాజీ జీవనోపాధి కోసం నాలుగేళ్ల క్రితం దుబాయ్‌ వెళ్లాడు. భార్య బుజ్జి గ్రామంలోనే ఉంటూ కూలి పనులు చేసుకునేది. ఈ క్రమంలో బుజ్జికి అదే గ్రామానికి చెందిన బానావత్‌ పరశురాంతో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త లేకపోవడంతో వారిద్దరు జల్సాలు చేశారు. కాగా, 4 నెలల క్రితం భర్త బాలాజీ దుబాయ్‌ నుండి తిరిగి వచ్చాడు. ఆయన వచ్చిన రెండు నెలల తర్వాత భార్య అక్రమ సంబంధం విషయం బాలాజీ తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. బాలాజీ భార్యను కట్టడి చేయడంతో అతడిని అడ్డు తొలగించుకోవడానికి బుజ్జి, ఆమె ప్రియుడు పరశురాం పథకం పన్నారు.

బాలాజీని హత్య చేయడానికి గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలానికి చెందిన నలుగురు వ్యక్తులకు రూ.90 వేలు సుపారీ ఇచ్చి మర్డర్ ప్లాన్ చేశారు. పథకం ప్రకారం ఈ నెల 7వ తేదీ రాత్రి బాలాజీని చంపేందుకు ప్రయత్నించగా విఫలమైంది. దీంతో 9వ తేదీ రాత్రి బుజ్జి, పరశురాంతోపాటు నలుగురు సుపారీ వ్యక్తులు కలిసి ఇంటి ముందు నిద్రిస్తున్న బాలాజీని ముక్కు, మూతి మూసి చేతులతో తలపై బలంగా మోది హత్య చేశారు. అనంతరం ఎవరికి అనుమానం రాకుండా మృతదేహాన్ని గదిలో పడుకో పెట్టి వెళ్లిపోయారు. భర్త నిద్రలోనే చనిపోయినట్టుగా బుజ్జి అందర్నీ నమ్మించడానికి ప్రయత్నించింది. అయితే బాలాజీ మృతిపై అతడి అన్న నెహ్రూకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మర్డర్ ఘటన వెలుగులోకి వచ్చింది.

హతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బుజ్జి, పరుశురాంలను అదుపులోకి తీసుకుని విచారించారు. మొదట తమకే పాపం తెలియదని బుకాయించినా.. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. మర్డర్ ఎలా చేశారు.. ఎవరెవరు చేశారో తెలపడంతో ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2 మోటారు సైకిళ్లు, 5 సెల్‌ఫోన్లు, రూ.30వేల నగదు, చేతులకు ధరించే 4 గ్లౌజులను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రఘు వివరించారు. కేసులో చురుకుగా వ్యవహరించిన కోదాడ రూరల్‌ సీఐ కె.శివరాంరెడ్డి, ఎస్‌ఐ రవీందర్, పీఎస్‌ఐ రంజిత్‌ కుమార్, సిబ్బంది వెంకటేశ్వర్లు, రామారావు, వీరబాబు ఆంజనేయులను ఎస్పీ రాజేంద్ర ప్రసాద్‌ అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు.


Next Story