గ్రామంలో వారిదే ముఖ్య పాత్ర.. వారి కష్టాలు తీరేది ఎప్పుడు ?

by  |
గ్రామంలో వారిదే ముఖ్య పాత్ర.. వారి కష్టాలు తీరేది ఎప్పుడు ?
X

దిశ, స్టేషన్ ఘన్ పూర్: తెల్లవారింది మొదలు రాత్రి వరకు గ్రామాల్లో ప్రతి పని, సమస్యని పరిష్కరిస్తూ ఏళ్ళతరబడి సేవలందిస్తున్న కారోబార్‌లకు ఎదుగుదల లేక కష్టాల కడలిలో సాగుతున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల నుండి మల్టీ పర్పస్ ఉద్యోగులుగా మారి వేతనాలు కొంత పెరిగినా, ముందుకు సాగని పదోన్నతులు, సెలవులు లేవు, పని భారంతో ఇబ్బందులు పడుతూ ఈ కష్టాలు తీరేది ఎప్పుడు అని ఆందోళన చెందుతున్నారు.

ప్రతి పనిలో కీలక పాత్ర

గ్రామపంచాయతీ కార్యక్రమాల నిర్వహణ, వార్డు సభ్యులు, సర్పంచ్‌ల మధ్య సంధాన కర్తగా, గ్రామ సభల నిర్వహణ, ప్రభుత్వ పథకాల ప్రచారం వాటి అమలు, పింఛన్ల కోసం వచ్చే దరఖాస్తుల స్వీకరణ, మంజూరు, గ్రామంలో జనన మరణం రికార్డుల నమోదు, మండల పరిధిలో పంచాయతీ రాజ్, విద్య, వైద్య, ఆర్ డబ్ల్యూఎస్, విద్యుత్, రోడ్డు రవాణా వివిధ శాఖల అధికారులకు కావలసిన సమాచారాన్ని చేరవేయడం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతం చేయడంలో కారోబార్‌‌ల పాత్ర కీలకమైంది. ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు తర్వాత గ్రామ నర్సరీలు, పల్లె ప్రకృతి వనాల రక్షణ, ఉపాధి కూలీలకు పని కల్పించడంలో కార్యదర్శులకు అండగా ఉండి పల్లె ప్రగతి కార్యక్రమాలు సహా ప్రతి కార్యక్రమంలో కీలకంగా పని చేస్తూ గ్రామ అభివృద్ధిని ప్రగతిలో కి నడిపిస్తున్నారు.

పన్నుల వసూలు కీలకం

ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ ఒక ఎత్తయితే గ్రామంలో ఇంటి పన్ను, నల్ల పన్నులు వసూలు చేయడం అతి కీలకం. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం గ్రామ పంచాయతీ సిబ్బందిని పనులకు పుర మాఇస్తూనే పన్నుల వసూలు పై దృష్టిసారిస్తున్నారు. గ్రామ పరిధిలోని దుకాణాలు, ఇంటింటికి తిరగడం నోటీసులు ఇవ్వడం పన్నులు వసూలు చేయడం, వసూలు చేసిన పన్ను( టాక్స్) ఎస్ టీఓ‌లో జమ చేయడం వారి ప్రథమ కర్తవ్యం. రోజువారీగా వచ్చే ఆదాయమే గ్రామ ఆదాయం. అట్టి ఆదాయంతోనే గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు.

పారిశుద్ధ్యం పై పర్యవేక్షణ

పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలన్నా.. ప్రభుత్వ ఆదేశాల మేరకు వీధులు శుభ్రం చేయించడం, తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించి ట్రాక్టర్ల ద్వారా ఊరికి దూరంగా తరలించే కార్యక్రమాన్ని కారోబార్‌లు పర్యవేక్షిస్తారు. అంతేకాకుండా మురికి కాలువలు శుభ్రం చేయడం, నీటి క్లోరినేషన్, అవసరం ఉన్న చోట బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తూ గ్రామాలలో వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలా ప్రతి పనిని తమ భుజస్కంధాలపై వేసుకుని సమస్యలు పరిష్కరిస్తే, అధికారులు – ప్రజాప్రతినిధుల మధ్య సంధాన కర్తగా పనిచేస్తూ గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న కారోబార్ ల వేతనాలు పెంచి, పదోన్నతులు కల్పించాలని కోరుకుంటున్నారు.

సహాయం కార్యదర్శిగా పదోన్నతులు ఇవ్వాలి

గత 30 ఏళ్లుగా కారోబార్ విధులు నిర్వహిస్తూ గ్రామ ప్రజలకు సేవలు అందిస్తున్న. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న వేతనం సరిపోక కుటుంబాల పోషణకు కారో బార్లు ఇబ్బందులు పడుతున్నాం. మా కుటుంబాలకు ఉచిత వైద్యం అందించాలి. వేతనాలు పెంచడంతోపాటు కారోబార్ల కు సహాయ కార్యదర్శి గా పదోన్నతులు ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలి.

ఎండి. సలీం, తాటికొండ కారోబార్

వేతనాలు పెంచాలి..

కాంట్రాక్టు ఉద్యోగుల నుండి మల్టీ పర్పస్ ఉద్యోగులుగా పేరు మార్చిన మాకు నెల జీతం రూ.15 వేలకు పెంచాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నట్టుగానే ఆదివారం, పండుగ దినాలు అన్ని సెలవులు వర్తింప చేయాలి. కారోబార్ కుటుంబానికి హెల్త్ కార్డులు జారీ చేయాలి. రెగ్యులర్ ఉద్యోగులు గా గుర్తించాలి.

గూగులోత్ రతన్ సింగ్, గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం చిల్పూర్ మండల ప్రధాన కార్యదర్శి.


Next Story