మళ్లీ పెరుగుతోన్న కరోనా కేసులు.. కేంద్రం హెచ్చరిక

by  |
corona, india
X

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కేసులు కొన్ని జిల్లాల్లో మళ్లీ పెరుగుతుండటంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తపరిచింది. దేశంలో మొత్తం కేసులు నమోదులో వారంవారీగా తగ్గుదల కనిపిస్తున్నదని, కానీ, గతనెలలతో పోలిస్తే మళ్లీ కేసులు మితంగా పెరుగుతున్నట్టు కనిపిస్తున్నదని వివరించింది. కేరళ నుంచి ఏడు జిల్లాలు, మణిపూర్ నుంచి ఐదు, మేఘాలయ నుంచి మూడు జిల్లాలు సహా మొత్తం 22 జిల్లాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయని తెలిపింది. కొన్ని జిల్లాల్లో కేసుల తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ గతంలో కంటే మెరుగ్గా గణాంకాల్లేవని పేర్కొంది. ఎనిమిది జిల్లాల్లో పాజిటివిటీ రేటు తగ్గుతున్నప్పటికీ కొత్త కేసులు పెరుగుతున్నాయని వివరించింది. కరోనా మహమ్మారిని ఈజీగా తీసుకోవద్దని, నిబంధనలు పాటించి అలసిపోయారేమోకానీ, వైరస్‌కు అలుపులేదని హెచ్చరించారు.

చిన్నపాటి నిర్లక్ష్యమైనా మహమ్మారి పంజా విసిరే ముప్పు ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వివరించారు. వైరస్ ఇంకా సమసిపోలేదని, ప్రపంచదేశాల్లో మళ్లీ కేసులు ఊపందుకున్నాయనీ గుర్తుచేశారు. కాగా, రోజువారీ కేసుల్లో కేరళ, మహారాష్ట్రల నుంచే సగం నమోదవుతున్నాయని తెలిపారు. కరోనా నియంత్రణపై కేరళ ఫోకస్ పెట్టడం లేదని ఆరోపించింది. ఈ రాష్ట్రాల్లో ఆరోగ్యసదుపాయాల మెరుగ్గా ఉండటంతోనే మరణాలు తక్కువగా నమోదవుతున్నాయని వివరించింది.



Next Story