మంత్రుల భూ దందాపై సీబీఐ విచారణ చేయాలి

by  |
Power Point Presentation
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో భూకబ్జాలు తారాస్థాయికి చేరాయని, పేదల భూములపై అధికార టీఆర్‌ఎస్ నేతలు గద్దల్లా వాలుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ మండిపడ్డారు. ప్రస్తుతం మాజీ మంత్రి ఈటల రాజేందర్​ భూ కబ్జా ఆరోపణలు ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో దళితులు, దేవుడి మాన్యాలను ఆక్రమించుకున్న వారిపై కూడా అదే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ఈ మేరకు శుక్రవారం “ గరీబోళ్ల భూముల్లో గులాబీ గద్దలు”అనే అంశంపై పవర్​ పాయింట్​ ప్రజంటేషన్​ ఇచ్చారు.

ఈ సందర్భంగా సంపత్​ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కేబినెట్‌లో 12 మంది మంత్రులపై భూకబ్జా ఆరోపణలున్నాయని, పలుమార్లు బహిరంగంగానే భూ కబ్జాలపై మాట్లాడినట్లు ఆధారాలు బయటపడ్డాయన్నారు. టీఆర్‌ఎస్ పాలనలో 7 లక్షల ఎకరాలు కబ్జా అయినట్లు రియల్టర్ల అసోసియేషన్ ఆరోపించిందని పేర్కొన్నారు. జన్వాడలో 111(జీ) లో నిబంధనలకు విరుద్ధంగా మంత్రి కేటీఆర్ ఫాంహౌజ్ కట్టుకున్నారని, దేవరాయాంజల్​లో కూడా వివాదాస్పద భూములను కేటీఆర్ కొనుక్కొన్నారని ఆరోపించారు.

మంత్రి మల్లారెడ్డి తన కాలేజీలను కూడా అనుమతులు లేకుండా నిర్మించారని, అయినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. టీఆర్ఎస్​ పార్టీకి మంత్రి మల్లారెడ్డి బ్యాంకు లాంటవాడని విమర్శించారు. మరో మంత్రి గంగుల కమలాకర్ కాజిపూర్ సర్వే నెం 126 లో వక్ఫ్‌బోర్డు భూములను కబ్జా చేశారని, ఆయన ఏకంగా ప్రభుత్వంపైనే కోర్టులో కేసు వేశాడని గుర్తు చేశారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన మంత్రి గంగులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మంత్రి పువ్వాడ అజయ్ కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని తన మెడికల్ కాలేజీలో కలుపుకున్నారని, నాగార్జున సాగర్​కు చెందిన ప్రభుత్వ భూమిని అప్పనంగా అనుభవిస్తున్నాడని, పార్టీ మారినందుకు ఆయనకు రూ. 50 కోట్ల విలువైన భూమిని ఇచ్చారని సంపత్ ఆరోపించారు. టీఆర్​ఎస్​లో చేరినందుకే ఆయనకు సర్వే నెంబర్ 58,59 లో కోట్లు విలువ చేసే భూమిని నజరానాగా ఇచ్చారని అన్నారు.

మంత్రి నిరంజన్ రెడ్డి పెబ్బేరు, కొత్తపేట గ్రామాల్లో భూములను ఆక్రమించారని, 200 ఎకరాల్లో ఫాంహౌస్​ కట్టుకున్నాడన్నారు. మంత్రి శ్రీనివాస్​గౌడ్​ కూడా కోట్ల విలువైన భూములను కబ్జా చేశారని, మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ కుష్టు రోగుల ఆస్పత్రి భూములను కూడా వదల్లేదని మండిపడ్డారు. మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి భూ ఆక్రమణలపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా ఎందుకు పట్టించుకోవడం లేదని సంపత్​ ప్రశ్నించారు. మంత్రులు జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి మీద కూడా ఆరోపణలు ఉన్నాయని వివరించారు. ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ పట్టణం సర్వే 1309 లో 5 ఎకరాలను ఆక్రమించారని, ఇవేవీ కూడా సీఎంకు కనిపించడం లేదా? అని సంపత్ నిలదీశారు. మంత్రుల భూ ఆక్రమణలపై విచారణ జరగాలని, నిజాలు నిగ్గుతేల్చాలని పేర్కొన్నారు. సీబీఐతో గానీ, సెంట్రల్ విజిలెన్స్‌తో గానీ ప్రభుత్వం విచారణ జరిపించాలని సంపత్ డిమాండ్ చేశారు.

భూముల పేరుతో దగా చేస్తున్నారు : టీపీసీసీ చీఫ్​ ఉత్తమ్​

కాంగ్రెస్​ పార్టీ గిరిజనులు, దళితులకు లక్షల ఎకరాలను ఇచ్చిందని కానీ అధికార టీఆర్‌ఎస్ నేతలు పేదల భూములను రాబందుల్లా తింటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దుయ్యబట్టారు. భూములు లాక్కోవడానికే ప్రజా ప్రతినిధులైనట్లు టీఆర్‌ఎస్ వాళ్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేబినెట్ లో ఉంటూ మంత్రులే దోపిడీ చేస్తున్నారని, ఈ విషయంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులంతా అత్యంత జాగరకూతతో ఉంటూ, అధికార పార్టీ నేతల భూ అక్రమాల వివరాలు అందించాలని ఉత్తమ్ సూచించారు. భూముల విషయంలో తాము గవర్నర్‌కు లేఖ రాస్తామని, భూముల దొంగలపై ఆధారాలతో సహా కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు. టీఆర్‌ఎస్ నేతల భూకబ్జాలపై విచారణ జరగాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed