ప్రేమించలేదని కాల్చి చంపాడు

by  |
ప్రేమించలేదని కాల్చి చంపాడు
X

దిశ, వెబ్‌డెస్క్: మూడేళ్లుగా ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నా.. పట్టించుకోలేదని ఓ ప్రబుధ్దుడు ప్రాణం తీశాడు. గులాబి పువ్వులతో వెంటపడ్డ అతడు చివరికి తుపాకీ తూట్ల వర్షం కురిపించాడు. వెంటపడుతున్నవాడు వద్దంటే మానేస్తాడనుకున్న అమాయకయువతి అతడి చేతుల్లోనే బలైపోయింది. కాగా, పోలీసుల నిర్లక్ష్యంతోనే తన కూతురు హత్య చేయబడిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఉన్మాది హత్య చేస్తే పోలీసులపై బాధిత తల్లిదండ్రులు ఎందుకు ఆరోపించారనుకుంటున్నారా.. అసలు కథ వింటే మీరు షాక్ అవుతారు. మూడేళ్ల ముందు జరిగిన పరిణామాలే ఈ దారుణానికి దారి తీశాయని బాధితులు చెబుతున్నారు.

అసలేమైందంటే..

హర్యానాలోని ఫరిదాబాద్‌లో 2018లోనే నిఖితా తోమర్ అనే యువతిని తౌసిఫ్ అనే యువకుడు ప్రేమ పేరుతో వెంటపడ్డాడు. ఆ యువకుడి ప్రవర్తన నచ్చని నిఖితా చాలా వరకు దూరంగా పెడుతూ వచ్చింది. దీంతో ఒకానొక సమయంలో యువతి పై కోపం తెచ్చుకున్న తౌసిఫ్ కిడ్నాప్ చేసేందుకు యత్నించాడు. గట్టిగా కేకలు వేయడంతో స్థానికుల ప్రమేయం కారణంగా అప్పుడు వదిలేశాడు. కానీ, తన కూతురిని ఎత్తుకెళ్లే ప్రయత్నం జరిగిందన్న విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు.

ఇక ఎలాగైన తౌసిఫ్‌కు తగిన బుద్ధి చెప్పేందుకు 2018లోనే పోలీసులను ఆశ్రయించారు. అయితే, అదేసమయంలో యువకుడు మైనర్, తదితర కారణాల వల్ల పోలీసులు కేసును అంతగా పట్టించుకోలేదని బాధితులు చెప్పారు. తన ప్రేమను ఒప్పుకోకపోవడం, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిఖితా పై ఉన్న ప్రేమను కాస్తా ‘పగ’గా మార్చుకున్నాడు. ఇక అప్పటి నుంచి సమయం కోసం ఎదురుచూడసాగాడు. అయినప్పటికీ యువతిని పలు సార్లు ప్రేమించమని వేధించసాగాడు.

అతడి వేధింపులు భరించలేని నిఖితా నువ్వంటే ఇష్టం లేదని తేల్చి చెప్పేయడంతో ఇంకా పగతో రగిలిపోయాడు. ఇక తాజాగా తనను కిడ్నాప్ చేసి లొంగదీసుకుందామనుకున్న తౌసిఫ్.. తన వెంట ఒక రివాల్వర్‌ను తెచ్చుకున్నాడు. లాక్‌డౌన్ అనంతరం విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలోనే పరీక్షలు రాస్తున్న నిఖితా ఆచూకీ తెలుసుకున్నాడు.

ఈ నేపథ్యంలోనే సదరు కాలేజీ బయట నిలబడి మరోసారి నిఖితా తోమర్‌ను కారు ఎక్కించే ప్రయత్నం చేశాడు. తనను కిడ్నాప్ చేస్తున్నాడని గ్రహించిన యువతి అతడిని వెనక్కినెట్టి పారిపోయే ప్రయత్నం చేసింది. దీంతో తౌసిఫ్ తన వద్ద ఉన్న రివాల్వర్‌ తీసి కాల్పులు చేశాడు. అనంతరం పరారీ అయ్యాడు. బాధితురాలిని సమీప హాస్పిటల్‌ తీసుకెళ్లే సరికి ఆమె చనిపోయింది. తన కూతురు చావును జీర్ణించుకోలేక పోయిన తల్లిదండ్రులు బోరున విలపించారు. పరీక్షలు రాయడానికి వెళ్లి దారుణ హత్యకు గురవడంతో శోకసంద్రంలో మునిగారు. అయితే, 2018లో స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే అతడి పై చర్యలు తీసుకోకుండా పోలీసులు వదిలేయడంతోనే తన కూతరు చనిపోయిందని తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.


Next Story

Most Viewed