రాజధాని అంటే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కాదు.. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

by  |
buggana
X

దిశ, ఏపీ బ్యూరో : వికేంద్రీకరణ వల్లే అభివృద్ధి సాధ్యమని.. అన్ని ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వం ధ్యేయం అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. ఏపీ శాసనమండలిలో మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును మంగళవారం ఆయన ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అభివృద్ధి వికేంద్రీకరణ రద్దు బిల్లుపై మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ కేంద్రంగా అభివృద్ధి జరిగిందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని శివరామకృష్ణన్‌ కమిటీ, జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ చెప్పాయని అందువల్లే తాము అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం అమాయకుల నుంచి 33వేల ఎకరాలను సేకరించింది. ఎక్కడా లేనట్లు 7500 చ.కి.మీటర్లలో రాజధానిని కడతామన్నారు. 50వేల ఎకరాల్లో రాజధాని కట్టాలంటే కనీస అవసరాలకే రూ.లక్ష కోట్లు ఖర్చు అవుతుంది.

రాజధాని అంటే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కాదు. ఒకే చోట అన్ని సంస్థలు పెడితే ఏ ప్రాంతమూ అభివృద్ధి చెందదు. అభివృద్ధి వికేంద్రీకరణ అవసరం ఎంతైనా ఉందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ పునరుద్ఘాటించారు. ‘1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడితే 1956లో ఆంధ్రప్రదేశ్‌గా అవతరించింది. 50 -60 ఏళ్లలో ఎన్నో సంఘటనలు జరిగాయని చెప్పుకొచ్చారు. తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని వెల్లడించారు. అయితే తెలంగాణ ఉద్యమం రావడంతో తెలుగు రాష్ట్రం కాస్తా రెండుగా విడిపోయినట్లు వెల్లడించారు. అభివృద్ధిని ఒకేచోట కేంద్రీకరించటమే విభజనకు మూలమైందని తెలిపారు. తెలంగాణ ఉద్యమం ఉధృతం అవుతున్న తరుణంలో కేంద్రప్రభుత్వం నియమించిన జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ కూడా ఇదే చెప్పిందని వెల్లడించారు. విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం చట్ట పరంగా ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్‌లో భాగంగా శివరామకృష్ణన్ కమిటీ వేసింది.

అర్బన్ డెవలప్‌మెంట్‌, టౌన్‌ ప్లానింగ్‌లో నలుగురు నిపుణులతో శివరామకృష్ణన్‌ రిపోర్టు రూపొందించి కేంద్రానికి అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర రాజధాన్ని ఎంపిక చేసే బాధ్యతను శివరామకృష్ణన్‌కు అప్పజెప్పారు. ఆయన ఏ ప్రాంతాన్ని సూచించకపోయినా రాష్ట్రానికి వికేంద్రీకరణ ఎంతో అవసరమని పలు ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందాలో రిపోర్టులో సూచించారు. గుంటూరు, తెనాలి మూడు పంటలు పండే భూమి.. విపరీతమైన ధర కలిగిన భూమి. చాలా కాస్ట్‌లీ భూమిని అనవసరమైన వాటికి వృధా చేయవద్దు. దీంతో పాటు పరిపాలన వికేంద్రీకరణ చేయాల్సి ఉంది. తెలంగాణ ఏర్పాటు వంటి చేదు అనుభవం ఉండకూడదని రిపోర్టులో శివరామకృష్ణన్ సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో కేంద్రానికి సంబంధించిన సంస్థలు వచ్చినప్పుడు హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేశారు. కేంద్ర సంస్థల యాగ్జిలరీ యూనిట్స్ ద్వారా రాష్ట్రాలు అభివృద్ధి చెందేవి. అయితే గొప్ప సంస్థలన్నీ హైదరాబాద్‌ కేంద్రంగా నెలకొల్పడంతో అభివృద్ధి హైదరాబాద్ కేంద్రంగానే జరిగిందని అందువల్ల హైదరాబాద్‌ గొప్ప నగరం అయిందని చెప్పుకొచ్చారు. కానీ మిగతా రాష్ట్రం అంతా అభివృద్ధికి నోచుకోలేకపోయిందని బుగ్గన అన్నారు.

అదేబాటలో చంద్రబాబు కూడా..

2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు ఇదే బాటలో మొదలుపెట్టారు. ఇంత అనుభవం పెట్టుకొని ఇదే బాటలో వెళ్లారు. శివరామకృష్ణన్‌ రిపోర్టు అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా జిల్లాలా, శ్రీకాకుళం కూడా అభివృద్ధి చెందాలి. విజయనగరం జిల్లా గుంటూరుతో సమానంగా ఉండాలి. చిత్తూరు నెల్లూరుతో సమానంగా ఉండాలనే ఆలోచన ఏ పాలకులకైనా ఆటోమ్యాటిక్‌గా వస్తుంది. చంద్రబాబుకు మాత్రం రాలేదు. 7500 చ.కి.మీ కేపిటల్‌ ఏరియా పెట్టారు. బాంబే గమనిస్తే థానే, కళ్యాణ్‌, నవీ ముంబై, ఉల్లాస్‌ నగర్, మీరా గమనిస్తే 4500 చ.కి.మీ మాత్రమే. బాహుబలి మాదిరిగా ఒక సినిమాలో కేపిటల్ 7500 చ.కి.మీ పెట్టారు. రాజధాని అభివృద్ధి చెందదట. కానీ, వీళ్లే (టీడీపీ ప్రభుత్వం) అభివృద్ధి చేస్తారట. 2014 విభజన జరిగేసరికి రెవిన్యూలోటు ఉందని ప్రతిరోజూ చంద్రబాబు చెప్పేవారు. రెవిన్యూలోటు ఉండి.. జీతభత్యాలకు ఇబ్బంది ఉండి.. ఐదేళ్లలో ఎలాంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్ లేదు అని ఆర్థికమంత్రి బుగ్గన ఆరోపించారు. 2019లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం వైయస్‌ జగన్ ఎక్స్‌ఫర్ట్‌ కమిటీని ఏర్పాటు చేశారు. వారి ప్లాన్స్‌ రివ్యూ చేసి.. ఒక పద్ధతి మార్గంలో ముందుకు తీసుకువెళ్లటానికి ఒక నివేదిక ఇవ్వమని కోరారు. ప్రొఫెసర్ డాక్టర్ మహావీర్‌ (డీన్ ఆఫ్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌), డాక్టర్ అంజలీ మోహన్, శివానంద స్వామి, సీపీటీ-అహ్మదాబాద్‌, కే.టీ.రవీంద్రన్, రిటైర్డ్‌ డీన్‌ ఆఫ్‌ ఢిల్లీ స్కూల్ ఆఫ్‌ ఆర్కిటెక్చర్, డాక్టర్ కె.వి.అరుణాచలం, రిటైర్డ్ చీఫ్‌ అర్బన్ ప్లానింగ్-చెన్నైతో నిపుణుల బృందం పెట్టడం జరిగింది. టీడీపీ వాళ్లేమో ఐదు మంది వ్యాపారస్తులను పెట్టారు. వారి పేర్లు చెబితే బావుండదు. ఒకరు విత్తనాలు, ఒకరు రియల్‌ ఎస్టేట్, పరిశ్రమలు, సినిమా పెట్టేవారితో ప్లానింగ్ ప్రకారం చేశారు. చంద్రబాబు నిర్ణయం తప్పని అన్ని కమిటీలు స్పష్టం చేశాయని కానీ దాన్ని చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు.

చట్టాలను ఎందుకు రద్దు చేస్తున్నామంటే..

ఏపీ సీఆర్‌డీఏ యాక్ట్‌ను మనం అమరావతి మెట్రోపాలిటిన్ రీజన్ ఏరియాగా మార్చటం జరిగింది. జోన్లు, ప్రాంతాలు, నగరాలు ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అయితే ప్రధానంగా రాజకీయాల వల్ల ప్రాంతీయతత్వం కొంతమందిలో రెచ్చగొట్టారు. ఈ ప్రభుత్వం మీద, సీఎం మీద సంపూర్ణ నమ్మకం ఉండటంతో వేరే సబ్జెక్ట్ లేక అమాయకుల్ని రెచ్చగొడుతూ.. హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి వస్తూ నటిస్తున్నారు. టీవీ చూసినా, ప్రజలు ఎవరైనా అక్కడకి వెళ్లి గమనించినా చెబుతారు. ఇప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఎవరెవరైతే.. ఒకశాతమో, రెండు శాతమో.. వీరి ప్రలోభాలకు లోనైతే.. వారి ప్రశ్నలకూ సమాధానం చెబుతాం. హేతుబద్ధతో సమాధానం చెబుతాం. పాలసీపై ఒకటికి, రెండు శాతం మందితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. పాత అనుభవాలు ఉండకూడదు. ప్రతి ఒక్క రీజియన్ సంతోషంతో ముందుకు వెళ్లాల్సి ఉంది. ఎంతో ఉదారత్వంతో చట్టాల్ని రద్దు చేస్తున్నామని బుగ్గన రాజేంద్రనాథ్ ప్రకటించారు. రాష్ట్రాన్ని ఒక మంచి డైరెక్షన్‌లో ముందుకు తీసుకువెళ్లాలని తక్షణమే పరిపాలన వికేంద్రీకరణ-సమ్మిళిత అభివృద్ధి ఉపసంహరణ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు మంత్రి బుగ్గన ప్రకటించారు.



Next Story