దైవదర్శనాలకు ముహూర్తం ఫిక్స్

by  |
దైవదర్శనాలకు ముహూర్తం ఫిక్స్
X

దిశ, ఏపీ బ్యూరో: ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ఆలవాలమైన ఆంధ్రప్రదేశ్‌లో దైవదర్శనాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. లాక్‌డౌన్ కారణంగా సుమారు రెండు నెలలకు పైగా దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెలిసిందే. అయితే, తాజా సడలింపులతో ఈ నెల 8 నుంచి దైవ దర్శనాలకు అనుమతులిస్తున్నామనీ, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని దేవాలయ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. త్వరలోనే భక్తుల దర్శనాలకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేస్తామని తెలిపింది. తిరుమల తిరుపతిలో శ్రీవారి దర్శనాలకు అనుమతి ఇవ్వాలంటూ టీటీడీ ఈవో అనిల్ సంఘాల్ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. దానికి ఏపీ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ సమాధానమిస్తూ పై ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, భక్తులను అనుమతించే ముందు ట్రయల్ రన్ నిర్వహించాలని సూచించారు. అలాగే, వైరస్ నియంత్రణకు ఘాట్ రోడ్లలోనే స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించనున్నారు. ఏమాత్రం అనుమానం వచ్చినా వారిని నేరుగా క్వారంటైన్ కేంద్రాలకు తరలించనున్నారు. తిరుమలతో పాటు శ్రీశైలం మల్లన్న, విజయవాడ కనకదుర్గ, అన్నవరం సత్యనారాయణ స్వామి, విశాఖపట్టణం సింహాచలం, అరసవెల్లి సూర్యనారాయణ స్వామి, శ్రీకూర్మం, ద్రాక్షారామం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లోనూ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు హైందవేతర దేవాలయాలు కూడా ఈనెల 8 నుంచి తెరుచుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇప్పటికే చర్చిలు, మసీదుల్లో సామాజిక దూరం పాటించేలా మార్కింగ్‌లు వేశారు.

Next Story