అక్కడ కాంగ్రెస్ హేమా హేమీలు..! ఎటు పోయారు..?

by Disha Web Desk 12 |
అక్కడ కాంగ్రెస్ హేమా హేమీలు..! ఎటు పోయారు..?
X

దిశ ప్రతినిధి, సంగారెడ్డి: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగిన ఆ పార్టీ నేతలు ఎందుకో మౌనంగా ఉంటున్నారు. అధికార టీఆర్ఎస్​పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు నిత్యం జనం లో ఉంటే కాంగ్రెస్​ నేతలు మాత్రం ఎందుకో కనిపించకపోవడం చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్​ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్న సీనియర్లే ఇప్పుడు జనాలకు, పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఉమ్మడి మెదక్​జిల్లాలో సీనియర్ నేతలు ఉలుకు పలుకు లేకుండా ఉండటాన్ని పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారు.

మెతుకు సీమలో కాంగ్రెస్​ఇలా తయారు కావడానికి సీనియర్లే కారణమనే అభిప్రాయం కార్యకర్తల నుంచి వస్తుంది. ఉమ్మడి జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలుండగా ప్రస్తుతం సంగారెడ్డి మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిత్యం వహిస్తున్నారు. కాంగ్రెస్​పార్టీని బలోపేతం చేయడానికి ఒకటి రెండు నియోజకవర్గాలు మినహా మిగిలిన చోట్ల పెద్దగా లీడర్ల పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. ఈ క్రమంలోనే అసలు కాంగ్రెస్​నేతలు ఏం చేస్తున్నారు..? ఎక్కడ ఉన్నారు..? ఎటు పోతున్నారు..? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

అప్పడు ఓ వెలుగు..ఇప్పుడు చీకట్లో..

గతంలో ఉమ్మడి మెదక్​ జిల్లాలో కాంగ్రెస్​పార్టీ ఓ వెలుగు వెలిగింది. సిద్దిపేట మినహా మిగతా అన్ని చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించారు. సంగారెడ్డి, పటాన్​చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్, అందోలు, గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట, మెదక్, నర్సాపూర్​అసెంబ్లీ నియోజకవర్గాలుండగా అన్ని చోట్ల కాంగ్రెస్​బలంగా ఉండేది. అందోలు నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, జహీరాబాద్​ నుంచి మాజీ మంత్రి గీతారెడ్డి, సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి లాంటి సీనియర్లు పనిచేశారు.

అలాంటి సీనియర్లు ఇప్పుడు పార్టీలో సీరియస్‌గా పనిచేయడం లేదనే అభిప్రాయం కార్యకర్తల నుంచి వినిపిస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో కేవలం సంగారెడ్డి మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్​ ఎమ్మెల్యే ఉన్నారు. మంత్రి హరీష్​రావు, స్థానిక ఎమ్మెల్యేలు నిత్యం జనంలో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం పనిచేస్తున్నామని ప్రచారం చేసుకోవడంలో సక్సెస్​ అవుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్​కు దీటుగా కాంగ్రెస్​నేతలు పెద్దగా ప్రచారం చేసుకుంటున్న పరిస్థితులు మాత్రం ప్రస్తుతానికి కనిపించడం లేదు.

తప్పుడు ప్రచారం అయినా ఖండించని నేతలు

ఉమ్మడి జిల్లాలో పలువురు కాంగ్రెస్​ నేతల పై తప్పుడు ప్రచారం జరుగుతున్నది. అయినప్పటికీ వారు కనీసం ఖండించుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. ప్రధానంగా మాజీ మంత్రులు గీతారెడ్డి, దామోదర రాజనర్సింహ తో పాటు సంగారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే జగ్గారెడ్డి లు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంత కాలంగా ఈ ఆరోపణలు వస్తున్నప్పటికీ ఎవరు కూడా ఖండించడానికి పెద్దగా ఇష్టపడినట్లు కనిపించలేదు. ఇటీవల సంగారెడ్డి లో జగ్గారెడ్డి రోజువారీ పర్యటనలతో కొంత వరకు హల్​చల్​చేస్తున్నారు. ఇక అందోలు, జహీరాబాద్​ వంటి నియోజకవర్గాల్లో పార్టీ వ్యవహారాలపై కనీస స్పందన కనిపించడం లేదు.

ఉమ్మడి జిల్లాలో నారాయణఖేడ్, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో కాంగ్రెస్​నేతలు సంజీవరెడ్డి, తూంకుంట నర్సారెడ్డి, శ్రీనివాస్​ రెడ్డిలు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల వారు చెబుతున్నారు. గత కొద్ది రోజులుగా సంగారెడ్డి లో జగ్గారెడ్డి కూడా జనంలోకి వెళ్లి కొంత హల్​చేయగలుగుతున్నారు. మిగతా చోట్ల మాత్రం కాంగ్రెస్​ అసలు ఉన్నదా..? అనే అభిప్రాయం కనిపిస్తుంది. ప్రాజెక్టులు నిధులతో అధికార పార్టీ హంగామా ఉమ్మడి మెదక్​ జిల్లాకు సాగునీటి ప్రాజెక్టులు తీసుకువచ్చి తాము రైతుల కోసం పనిచేస్తున్నామని చెప్పుకోవడంలో అధికార టీఆర్ఎస్​ సక్సెస్ అయ్యింది. సిద్దిపేట జిల్లాలో మల్లన్నసాగర్​, రంగ నాయక్ ​సాగర్, కొండపోచమ్మ సాగర్​ రిజర్వాయర్లు ప్రారంభించుకున్న విషయం తెలిసిందే.

గత నెల నారాయణఖేడ్​లో బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​శంకుస్థాపన చేసిన విషయం కూడా విదితమే. ఉమ్మడి మెదక్​జిల్లాను సస్యశ్యామలం చేస్తున్నామని టీఆర్ఎస్​పార్టీ నేతలు విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. గతంలో నిర్మించిన సింగూరు ప్రాజెక్టు నుంచి చుక్క నీళ్ళు కూడా సాగు ఇవ్వలేదని, టీఆర్ఎస్​ప్రభుత్వం 40 వేల ఎకరాలకు సాగు నీరందించిందని కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే అభివృద్ధి పనులు చేస్తూ అధికార పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటుండగా ప్రతిపక్షంలో కాంగ్రెస్​పార్టీ నేతలు మాత్రం వేటి గురించి పట్టించుకోకుండా తమకేమీ పట్టనట్లుగా ఉండడంపై కాంగ్రెస్​పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నేడు మెదక్​కు రేవంత్​రెడ్డి రాక..

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ఆదివారం జిల్లా కేంద్రమైన మెదక్​కు రానున్నారు. పట్టణంలోని చర్చిలో రేవంత్​రెడ్డితో పాటు కాంగ్రెస్​ పార్టీ నేతలు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా సీనియర్ల ఎవరు హాజరుకానున్నారనే అంశం ఆసక్తిగా మారింది. జిల్లా పార్టీ నేతలు మాత్రం ఉమ్మడి జిల్లా నేతలు మొత్తం మెదక్‌కు వస్తున్నారని ప్రకటనలు చేసుకున్నారు. రేవంత్​రెడ్డితో పాటు ఏఐసీసీ నాయకులు అనిల్​ థామస్​కూడా మెదక్​రానున్న నేపథ్యంలో కొంత మంది కాంగ్రెస్​నేతలు ఏదో హంగామా చేస్తున్నప్పటికీ సీనియర్లలో ఏ మాత్రం ఉత్సాహం కనిపించడం లేదని పరస్థితులు స్పష్టం చేస్తున్నారు.

Next Story