ఇళ్లు కాదు..ఊళ్లే కడుతున్నాం: సీఎం జగన్

by Disha Web Desk 12 |
ఇళ్లు కాదు..ఊళ్లే కడుతున్నాం: సీఎం జగన్
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో ఇళ్లు కాదు..ఊళ్లకు ఊళ్లే కడుతున్నాం.30.76 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు అందజేశాం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణంపై స్వల్ప కాలిక చర్చలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. ప్రతి ఎమ్మెల్యే గర్వపడేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. వివక్షకు తావివ్వకుండా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు.

ఇక ఇళ్ల విషయానికి వస్తే తొలి విడతలో 15.60 లక్షల మందికి ఇళ్లు నిర్మించి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. సొంతిల్లు కట్టుకోవాలనుకునే ప్రతి పేదవాడి కలను సాకారం చేసే దిశగా ఈ ప్రభుత్వం పయనిస్తోందని వైఎస్ జగన్ తెలిపారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అధికారులు మహా యజ్ఞం చేశారని.. ఇళ్ల పట్టాల కోసం 71,811 ఎకరాల భూమి సేకరించినట్లు తెలిపారు. రూ.25వేల కోట్ల విలువైన భూమిని ప్రభుత్వం సేకరించిందని ఫలితంగా రాష్ట్రంలో 17 వేల కాలనీలు ఏర్పాటవుతున్న ట్లు సీఎం వైఎస్ జగన్ సభలో తెలిపారు.

సొంతిటి కల నెరవేరుస్తున్నాం

'సొంతిల్లు కట్టుకోవాలనేది ప్రతి ఒక్కరి కల. రాష్ట్రంలో పేదలకు 30.76 లక్షల ఇళ్ల పట్టాలు అందజేశాం. 71,811 ఎకరాల భూమిని పేదలకు ఇచ్చాం. రూ.25 వేల కోట్ల విలువైన భూమిని ప్రభుత్వం సేకరించింది. ప్రతి మహిళ చేతికి రూ.5 లక్షల వరకు ఆస్తిని ఇచ్చాం. తొలిదశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నాం. వివక్ష లేకుండా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్నాం. 30.76 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు అందజేశాం. ఇళ్ల నిర్మాణాలతో 17 వేల జగనన్న కాలనీలు ఏర్పాటవుతున్నాయి. తొలి దశలో 10 వేలకు పైగా జగనన్న కాలనీల నిర్మాణం. ప్రతి కాలనీలో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం 'అని సీఎం వైఎస్ జగన్ సభలో ప్రకటించారు.

జేసీల పర్యవేక్షణలో ఇళ్ల నిర్మాణాలు

'జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.32 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం.పేదల ఇళ్లకు తక్కువ ధరకే సిమెంట్, స్టీల్ అందజేస్తున్నాం. ఇళ్ల నిర్మాణానికి 20 టన్నుల ఇసుకను ఉచితంగా అందజేస్తున్నాం. వచ్చే డిసెంబర్‌ నాటికి టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తాం. ఇళ్ల నిర్మాణాల పర్యవేక్షణకు ప్రతి జిల్లాలో ఒక జాయింట్‌ కలెక్టర్‌ను నియమించాం. ప్రతి గ్రామ పంచాయతీలో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ అందుబాటులో ఉన్నారు. ఇంటి నిర్మాణాలను బట్టి దశల వారీగా బిల్లుల చెల్లింపులు చేస్తాం' అని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.

టీడీపీ అడ్డంకులు సృష్టిస్తున్నా అధిగమించాం

పేదలకు ఇళ్లు అందివ్వాలని మన ప్రభుత్వం ఎంతో శ్రమిస్తుంది. అంతేకాదు ఒక మహాయజ్ఞంలా అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులు పేదల ఇళ్ల నిర్మాణానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. అయితే ఈ మహా యజ్ఞానికి ఆటంకం కలిగించేందుకు టీడీపీ శాయశక్తులా కుట్రలు చేసింది. ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయితే ఎక్కడ వైఎస్‌ జగన్‌కు మంచి పేరు వస్తుందనే విఫరీతమైన దుర్భుద్ధితో కుట్రలు చేశారు.

విశాఖలో 1.80 లక్షల ఇళ్లకు ఇటీవలే కోర్టు క్లియరెన్స్‌ ఇచ్చింది. నా సొంత నియోజకవర్గం పులివెందుల లో కూడా టీడీపీ నేతలు అడ్డుకుంటే కోర్టు నుంచి ఆదేశాలు రావడంతో పనులు మొదలయ్యాయి. ఏప్రిల్‌లో పులివెందులలో ఇళ్ల పట్టాలు, ఇంటి నిర్మాణాలు మొదలవుతాయి. దేవుడి దయ వల్ల ఎన్ని కష్టాలు ఎదురైనా నిరుపేదలను ఇంటి యజమానులను చేసేందుకు ఈ ప్రభుత్వం గట్టిగా పని చేస్తుంది.పేదల కళ్ళలో కనిపించే ఆనందమే మాకు శక్తినిస్తుంది...మమ్మల్ని నడిపిస్తుంది అని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.





Next Story

Most Viewed