2025 తర్వాతే భారత మార్కెట్లోకి ఎలక్ట్రిక్ కారు తీసుకొస్తాం: వోక్స్‌వ్యాగన్!

by Disha Web Desk 17 |
2025 తర్వాతే భారత మార్కెట్లోకి ఎలక్ట్రిక్ కారు తీసుకొస్తాం: వోక్స్‌వ్యాగన్!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వాహన తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ భారత మార్కెట్లో తన ఎలక్ట్రిక్ వాహనాన్ని 2025 తర్వాతే తీసుకురానున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం డిమాండ్ మెరుగ్గా ఉన్నప్పటికీ ఆ సమయానికి మాత్రమే మెరుగైన ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) అమ్మకాలు జరుగుతాయని అంచనా వేస్తున్నామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. మంగళవారం కంపెనీ దేశీయ మార్కెట్లో తన సరికొత్త మిడ్-సైజ్ సెడాన్ వెర్టస్ మోడల్‌ను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా మాట్లాడిన కంపెనీ ప్యాసింజర్ కార్ల విభాగం బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా.. 2025 లోపు దేశంలో దిగుమతి చేసుకున్న బ్యాటరీ ఎలక్ట్రిక్ మోడళ్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రస్తుతానికైతే గ్లోబల్ మార్కెట్లో ఈవీ మోడళ్లు ఉన్నాయి. అయితే, ఇవి భారత మార్కెట్లకు అనువుగా ఉంటాయా లేదా అనేది చూడాలని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఇంధన కారు మోడళ్ల అమ్మకాలు మెరుగ్గా ఉన్న తరుణంలో ఈ విభాగంపై దృష్టి సారిస్తున్నామన్నారు.

ఎలక్ట్రిక్ వాహనాలు గణనీయమైన అమ్మకాలను జరిగే సమయంలో తమ ఈవీలను తెచ్చేందుకు చూస్తున్నామని ఆశిష్ గుప్తా వివరించారు. కాగా, మంగళవారం కంపెనీ తన వెర్టస్ మోడల్ కోసం బుకింగ్స్ ప్రారంభించామని ఆశిష్ అన్నారు. 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే ఈ మోడల్ అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉందన్నారు. దేశీయ వినియోగదారులను ఆకట్టుకునేందుకు 6 రంగుల్లో ఈ మోడల్‌ను తెచ్చామని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హోండా సిటీ, మారుతి సుజుకి సియాజ్, హ్యూండాయ్ వెర్నా మోడళ్లకు వోక్స్‌వ్యాగన్ వెర్టస్ పోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.



Next Story

Most Viewed