ప్రధాని మోడీని.. అబ్రహం లింకన్‌తో పోల్చిన ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్!

by Malleboina Mahesh |   (  Updated:2026-06-10 04:30:13  IST  )

చారిత్రక మైలురాయిని సృష్టించిన నరేంద్ర మోడీకి ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ అభినందనలు తెలిపారు. 25 కోట్ల మందిని పేదరికం నుండి విముక్తం చేసిన మోదీని అబ్రహం లింకన్‌తో పోల్చారు.

ప్రధాని మోడీని.. అబ్రహం లింకన్‌తో పోల్చిన ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్!
X

దిశ, వెబ్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ నేటితో విజయవంతంగా 12 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్నారు. దీంతో ఆయన భారతదేశంలో అత్యధిక కాలం పాటు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించి చరిత్ర సృష్టించి మొదటి స్థానంలో నిలిచారు. ఈ క్రమంలో భారత ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్. ప్రధాని మోడీని అబ్రహం లింకన్ తో పోల్చుతూ ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అందులో.. భారత ప్రధానమంత్రిగా ఎన్నికై, అత్యంత సుదీర్ఘ కాలం పాటు నిరంతరాయంగా పదవిలో కొనసాగుతూ చారిత్రాత్మక మైలురాయిని సృష్టించిన నరేంద్ర మోడీ (Narendra Modi)కి భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ (Vice President C.P. Radhakrishnan.) హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

ప్రధాని మోడీ సాధించిన ఈ ఘనత కేవలం ఆయన పదవీకాలాన్ని మాత్రమే సూచించదని, దేశ అభివృద్ధి ప్రయాణంలో ఒక గొప్ప పరివర్తనాత్మక శకాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన కొనియాడారు. గతంలో అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ లక్షలాది మందిని బానిసత్వ సంకెళ్ల నుంచి విముక్తులను చేసినట్లే, మోడీ కాలంలో 25 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలను కఠినమైన పేదరికపు సంకెళ్ల నుంచి విముక్తులను చేసి, లక్షలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపారని.. ఈ ఘనత మానవ చరిత్రలోనే అసమానమైనదని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు.

మోదీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో భారతదేశం ఆర్థిక వృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, సాంకేతిక పురోగతి సాధిస్తూనే అంతర్జాతీయ వేదికపై దేశ ప్రతిష్టను మరియు సాంస్కృతిక వారసత్వాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. కొత్త పార్లమెంట్ భవనంలో పవిత్ర ‘సెంగోల్’ను ప్రతిష్టించడం, కాశీ తమిళ్ సంగమం నిర్వహించడం, విదేశాల నుండి పురాతన కళాఖండాలను తిరిగి తీసుకురావడంతో పాటు ఐక్యరాజ్యసమితిలో తమిళ ముని కనియన్ పూంగుండ్రనార్ అమర వాక్యాలను ఉటంకించడం ద్వారా "వసుధైవ కుటుంబకం" అనే భారతీయ తత్వాన్ని మోడీ ప్రపంచానికి చాటారని గుర్తుచేశారు. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని చేరుకునే ప్రయాణంలో మోడీ నాయకత్వం కోట్ల మందికి స్ఫూర్తిదాయకమని పేర్కొంటూ, అలుపెరగని అంకితభావంతో దేశ సంక్షేమం కోసం శ్రమిస్తున్న ప్రధాని మోదీ సమకాలీన భారతదేశ "యుగ పురుషుడు" (Yug Purush) గా వెలుగుతున్నారని ఉపరాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు.

Next Story