Errabelli Pradeep Rao: పార్టీ మారొద్దు.. మంత్రి ఎర్రబెల్లి సోదరుడికి టీఆర్ఎస్ బుజ్జగింపులు

by Disha Web Desk 4 |
TRS Party tries to convince Errabelli Pradeep Rao not to change the party
X

దిశ, వెబ్‌డెస్క్: TRS Party tries to convince Errabelli Pradeep Rao not to change the party| మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు పార్టీ మారే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరగడంతో టీఆర్ఎస్ అలర్ట్ అయింది. ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది. పార్టీ వీడాలని భావిస్తున్న ప్రదీప్ రావుతో బుధవారం మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. టీఆర్ఎస్ పార్టీలో తనకు న్యాయం జరగదని భావించిన ప్రదీప్ రావు.. పార్టీని వీడేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారనే ప్రచారం జరిగింది. దీంతో ప్రదీప్ రావు పార్టీ వీడితే టీఆర్ఎస్ కు డ్యామేజ్ అవుతుందని భావించిన అధిష్టానం.. అతడిని ఆపేందుకు ప్రయత్నాలు కొసాగిస్తోంది. ఇందుకోసం బస్వరాజ్ సారయ్యను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. అయితే తనను కలిసేందుకు వచ్చిన సారయ్యతో ప్రదీప్ రావు ఆవేదన వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

పార్టీలో తనకు సరైన గుర్తింపు రావడం లేదని చెప్పాడని, అలాగే పార్టీలో జరుగుతున్న అన్యాయం పట్ల వివరించాడని తెలుస్తోంది. ఈ సందర్భంగా పార్టీ మారే విషయంలో మరోసారి ఆలోచించుకోవాలని, తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని బస్వరాజ్ సారయ్య సూచించినట్లు తెలుస్తోంది. పార్టీలో తప్పకుండా అవకాశం ఉంటుందని మీ డిమాండ్లను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చినట్లుగా టాక్ వినిపిస్తోంది. ప్రదీప్ రావు ఎమ్మెల్సీ టికెట్ ను ఆశించినప్పటికీ.. ఆయనకు అవకాశం దక్కలేదని, ఈ విషయంలో ఆయన తీవ్ర మనస్తాపం చెందినట్లు రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్‌లోనే కొనసాగితే తనకు అవకాశాలు రావని గ్రహించి.. ఈ నెల 7వ తేదీన బీజేపీలోకి వెళ్లేందుకు ప్రదీప్ రావు సిద్దం అయ్యారని, ఇందుకోసం తన అనుచరులతో చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తనను ఆపేందుకు చివరి ప్రయత్నంలో భాగంగా టీఆర్ఎస్ బస్వరాజ్ సారయ్యతో రాయబారం సాగించినట్లు తెలుస్తోంది. కాగా సారయ్య హామీతో ప్రదీప్ రావు ఆగుతారా? లేక కారు దిగి మరో పార్టీ గూటికి చేరుతారా? అనేది ఆసక్తిగా మారింది.

ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డికి పెను సవాల్.. రాజగోపాల్ రెడ్డి రూపంలో అగ్నిపరీక్ష

Next Story