మధ్యప్రాచ్య యుద్ధం.. ముగ్గురు భారతీయులు మృతి

by Muthe.Rajitha |

పశ్చిమాసియా యుద్ధ జ్వాలలు భారతీయ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. ఇరాన్ జరిపిన దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి చెందినట్టు ఒమన్ ప్రకటించింది.

మధ్యప్రాచ్య యుద్ధం.. ముగ్గురు భారతీయులు మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధంలో ముగ్గురు భారతీయులు మృతిచెందారు. అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ చేపట్టిన ప్రతీకార దాడులు సముద్ర మార్గాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఒమన్ తీరంలో ప్రయాణిస్తున్న రెండు వాణిజ్య నౌకలపై ఇరాన్ జరిపిన భీకర దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయినట్లు ఒమన్ షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ అధికారికంగా ధ్రువీకరించారు. ఈ వార్తను ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా ధ్రువీకరిస్తూ, మృతుల కుటుంబాలకు సమాచారం అందించినట్లు సమాచారం. ఇరాన్ దళాలు ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులు ఈ నౌకలను తాకడం వల్లే ఈ ఘోరం జరిగినట్లు తెలిపారు. ఈ దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో ప్రయాణిస్తున్న వేలాది మంది భారతీయ నావికుల భద్రత ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

ఇప్పటికే హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో వందలాది నౌకలు సముద్రం మధ్యలోనే నిలిచిపోయాయి. ఇప్పుడు ఏకంగా నౌకలపై దాడులు జరుగుతుండటంతో షిప్పింగ్ కంపెనీలు తమ సిబ్బందిని రక్షించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. భారత ప్రభుత్వం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. పశ్చిమాసియాలో చిక్కుకున్న భారతీయుల భద్రత కోసం విదేశీ వ్యవహారాల శాఖ ఇప్పటికే ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. యుద్ధం కారణంగా చమురు ధరలు పెరగడమే కాకుండా, ఇలా అమాయక భారతీయుల ప్రాణాలు పోతుండటం పట్ల కేంద్రం ఇరాన్, ఇతర దేశాలతో దౌత్యపరమైన చర్చలు జరుపుతోంది.

Next Story