రైలు కింద తలపెట్టి టెక్కీ సూసైడ్.. ఐటీ సెక్టార్ లో అసలేం జరుగుతోంది?

by Muthe.Rajitha |

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ లో మంగళవారం జరిగిన తరుణ్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా ఐటీ ఉద్యోగుల మెంటల్ హెల్త్ సమస్యలను మరోసారి ముందుకు తెచ్చింది.

రైలు కింద తలపెట్టి టెక్కీ సూసైడ్.. ఐటీ సెక్టార్ లో అసలేం జరుగుతోంది?
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ లో మంగళవారం జరిగిన తరుణ్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా ఐటీ ఉద్యోగుల మెంటల్ హెల్త్ సమస్యలను మరోసారి ముందుకు తెచ్చింది. వరంగల్‌కు చెందిన తరుణ్ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తూ... భార్య, మూడేళ్ళ కూతురుతో నివసిస్తున్నాడు. బయటకు జీవితం సక్రమంగానే కనిపించినా, గత ఏడాది నుంచి మానసిక సమస్యలతో బాధ పడుతూ అందుకోసం చికిత్స తీసుకుంటున్నాడు. మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన తరుణ్, ఖైరతాబాద్ రైల్వే గేట్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఒక్క ఘటన మాత్రమే కాదు, ఇటీవలి కాలంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఐటీ రంగంలో ఉద్యోగం మరీ అంత ఒత్తిడితో కూడుకొని ఉంటుందా అనే అనుమానాలు అందరిలోనూ రేకెత్తుతున్నాయి. గత ఐదారేళ్ళ వారీగా టెక్కీల సూసైడ్స్ గణాంకాలు చూస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది.

గణాంకాలు చుస్తే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే

2022లో భారతదేశంలో మొత్తం 1,71,000 మంది ఆత్మహత్యలు జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. మన దేశ జనాభాలో అంటే ప్రతి లక్ష మందికి 12.4 మంది సూసైడ్ చేసుకున్నారు. ఇది ప్రపంచ సగటు 9.2 కంటే చాలా ఎక్కువ. ఇందులో ఐటీ సెక్టర్‌కు ప్రత్యేకంగా పూర్తి డేటా లేకపోయినా.. 2017 నుంచి 2025 మధ్య కాలంలో 227 ఐటీ ఉద్యోగుల సూసైడ్ కేసులు రిపోర్ట్ అయ్యాయి. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణె వంటి ఐటీ హబ్‌లలో ఈ సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. సర్వేలు చెబుతున్నదేమిటంటే, 83% ఐటీ ఉద్యోగులు తీవ్ర పని ఒత్తిడితో అలసిపోతున్నట్టు సమాచారం. అలాగే 25% మంది వారానికి 70 గంటలకుపైగా పని చేస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఒక స్టడీ ప్రకారం.. 84% ఐటీ ఉద్యోగుల్లో లివర్ సమస్యలు ఉన్నాయి. ఇవి స్ట్రెస్ తోపాటు ఎలాంటి శారీరక శ్రమ లేకపోవడం వల్ల వస్తున్నాయట. ఇక కర్ణాటకలో ఆర్గన్ ట్రాన్స్‌ప్లాంట్ కోసం ఎదురు చూస్తున్నవారిలో 20% ఐటీ ప్రొఫెషనల్స్ ఉండటం కూడా పరిస్థితి టెక్కీలో అనారోగ్య సమస్యలకు అద్దం పడుతోంది. మరో అధ్యయనం ప్రకారం, 51.2% ఐటీ ఇంజినీర్లు వర్క్ స్ట్రెస్‌తో, 36% మంది మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారట.

అనారోగ్యాలకు మూల కారణాలివే

వీరి అనారోగ్య సమస్యలకు కారణాలు చాలా ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ప్రపంచంలోనే అత్యధిక ఒత్తిడి ఉన్న ఉద్యోగాల్లో ఒకటిగా మారాయి. లాంగ్ వర్క్ అవర్స్, డెడ్‌లైన్స్, ఓవర్‌టైమ్, కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చునే జీవనశైలి వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటోంది. కొన్ని ఐటీ వర్గాల్లో 70–90 గంటల వర్క్ వీక్ కూడా చాలా కామన్ అయింది. ఇక టెక్కీలను వెంటాడే మరో పెద్ద సమస్య జాబ్ ఇన్‌సెక్యూరిటీ. AI, ఆటోమేషన్ వల్ల 2025లోనే 6,000కుపైగా లేఆఫ్స్ జరిగాయి. ప్రతి సంవత్సరం దేశంలో సుమారు 15 లక్షల ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తే, అందులో కేవలం 10% మందికే సరైన ఉద్యోగాలు దొరుకుతున్నాయి. దీనితో పాటు మెంటల్ హెల్త్‌పై మాట్లాడటం ఇంకా ఒక స్టిగ్మాగా ఉంది. ఉద్యోగంలో ఒత్తిడి, వేధింపులు, జీతాల ఆలస్యం, కుటుంబ సమస్యలు.. ఇవన్నీ కలసి డిప్రెషన్‌ను పెంచుతున్నాయి. కోవిడ్ తర్వాత వర్క్–లైఫ్ బౌండరీలు పూర్తిగా చెరిగిపోయాయి. ఇంటి నుంచి పని చేయడం వల్ల పని సమయం, విశ్రాంతి సమయం అనే తేడా లేకుండా పోయింది. ఒంటరితనం, మద్యం అలవాటు, ఇతర అడిక్షన్లు కూడా సమస్యను మరింత పెంచుతున్నాయి.

డేంజర్ జోన్లో హైదరాబాద్‌

హైదరాబాద్‌లోనే 2026 జనవరి–ఫిబ్రవరి మధ్య జరిగిన ఘటనలు చూస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తుంది. ఫిబ్రవరి 2026లో ఖైరతాబాద్‌లో వై.తరుణ్ (30) రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. జనవరి 31న నెలలో మియాపూర్ ప్రాంతంలో సతీష్ (31) అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తీవ్ర వర్క్ ప్రెషర్ వల్ల ఇంట్లో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. సైనిక్‌పూరిలో సుందరమూర్తి అనే ఐటీ ఉద్యోగి గూడ్స్ ట్రైన్ ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. జనవరిలో పి. విజయ రెడ్డి(38) తన ఇద్దరు టీనేజ్ పిల్లలతో కలిసి రైలు ముందు దూకి సూసైడ్ ప్యాక్ట్ చేసుకోవడం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ఇలాంటి కేసులు ఇంకా చాలానే ఉన్నాయి. ఇవన్నీ ఒక్క వారి కుటుంబాన్ని మాత్రమే కాదు, మొత్తం సమాజాన్ని కుదిపేస్తున్నాయి.

కంపెనీల తక్షణ చర్యలు అవసరం

ఈ పరిస్థితిని మార్చాలంటే ఐటీ రంగంలో కొన్ని తక్షణ చర్యలు అవసరం. కంపెనీలు ఉద్యోగుల కోసం మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్స్, ఎంప్లాయీ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్ (EAP), వర్క్–లైఫ్ బ్యాలెన్స్, "రైట్ టు డిస్‌కనెక్ట్" లాంటి పాలసీలు తక్షణమే అమలు చేయాలి. ప్రభుత్వం లేబర్ క్లాజ్‌లను కఠినంగా అమలు చేయాలి. మెంటల్ హెల్త్ డేటాను సేకరించి, నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్‌ను బలంగా అమలు చేయాలి. వ్యక్తిగతంగా, స్ట్రెస్‌ను దాచుకోకుండా, ఫ్రెండ్స్‌తో మాట్లాడటం, అవసరమైతే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడం చాలా ముఖ్యం. మెంటల్ హెల్త్‌పై ఉన్న స్టిగ్మాను తగ్గించి, అవేర్‌నెస్ పెంచాలి. ఐటీ సెక్టర్ మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద ఆర్థిక వనరు. కానీ ఆ రంగాన్ని నడిపించే మనుషులు కూడా ముఖ్యమే. ఇటీవల జరుగుతున్న వరుస టెక్కీల సూసైడ్ ఘటనలు మొత్తం మానవ సమాజానికి పెద్ద హెచ్చరిక. ఇప్పుడైనా మార్పు తీసుకురాకపోతే, ఈ "నిశ్శబ్ద మహమ్మారి" చాపకింద నీరులా చేరి ఇంకా ఎక్కువ ప్రాణాలు తీసే ప్రమాదం ఉంది.

Next Story