ఒక్కరే కానీ..!! 8 పోస్టులు..!!

by Disha Web Desk 13 |
ఒక్కరే కానీ..!! 8 పోస్టులు..!!
X

దిశ, తుంగతుర్తి: ప్రస్తుత రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగి విధుల నిర్వహణ పరంగా తాను కొనసాగుతున్న పోస్టుకు న్యాయం చేయాలంటేనే గగనంగా మారుతోంది. అలాంటిది ఒకే ఉద్యోగి ఏకంగా 8 పోస్టులకు ఇన్ చార్జిగా వ్యవహరించడం అంటే మాటలు కాదు. అసలు ఇది చెప్పుకోవాలంటేనే దారుణమైన పరిస్థితి. ఊహకు అందని వైనం కూడా. ఇలాంటి విచిత్ర పరిస్థితి సూర్యాపేట జిల్లా గ్రంథాలయ శాఖలో నెలకొంది.

తుంగతుర్తి మండల కేంద్రంలోని శాఖా గ్రంథాలయంలో లైబ్రేరియన్ గా గత కొన్నేళ్ల నుండి పనిచేస్తున్న ఎం.వి. రంగారావు జిల్లాలోని ఛివ్వేంల, నూతనకల్, తిరుమలగిరి, జాజిరెడ్డిగూడెం, పెన్ పహాడ్, ఆత్మకూరు (ఎస్) మండలాలలో ఉన్న శాఖ గ్రంథాలయాలకు ఇన్ చార్జిగా(అవుట్ సోర్స్ సిబ్బంది ఉన్నప్పటికీ) వ్యవహరిస్తున్నారు.


అంతేకాదు జిల్లా కేంద్రంలోని ప్రధాన కార్యాలయానికి ఈయనే దిక్కు మొక్కుగా మారారు. ఇక్కడ జూనియర్, సీనియర్, రికార్డు అసిస్టెంట్, తదితర పోస్టుల విధులు రంగారావు చేస్తున్నారు. చివరికి అటెండర్ స్థాయి విధులను కూడా ఈయనే చేయాల్సి వస్తుంది.

ఎందుకీ దుస్థితి..?

జిల్లాలో మొత్తం గా 18 గ్రంథాలయ శాఖలు ఉన్నాయి. ఇందులో మూడు మాత్రమే రెగ్యులర్ పోస్టులు. మునగాల మండల కేంద్రంలో పనిచేసే లైబ్రేరియన్ లలితాదేవికి అదనంగా గరిడేపల్లి, నేరేడుచర్ల మండలాల బాధ్యతలు అప్పగించారు. మోతే మండల కేంద్రంలో పనిచేసే శ్యాంసుందర్ రెడ్డి ని సూర్యాపేట ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేశారు.


ఇక మిగిలిన కొన్ని ప్రాంతాలలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నప్పటికీ వాటిపై అజమాయిషీ మాత్రం ఎం.వి. రంగారావు పై ఏర్పడింది. ఇలాంటి పరిస్థితులతో గ్రంథాలయాల పనితీరు చాలా ప్రాంతాలలో అధ్వానంగా మారింది.


Next Story

Most Viewed