12-15 శాతం పెరగనున్న బంగారు ఆభరణాల రిటైలర్ల ఆదాయం!

by Disha Web Desk 17 |
12-15 శాతం పెరగనున్న బంగారు ఆభరణాల రిటైలర్ల ఆదాయం!
X

న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశీయ బంగారు ఆభరణాల రిటైలర్ల ఆదాయం 12-15 శాతం పెరుగుతుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. పసిడి ధరలు స్థిరంగా ఉండటంతో పాటు డిమాండ్ కారణంగా ఆదాయ వృద్ధికి అవకాశం ఉందని క్రిసిల్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో కొవిడ్-19 మహమ్మారి వల్ల ఆదాయం దెబ్బతిన్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ మెరుగైన ఆదాయాన్ని సాధించింది. 'గత కొంతకాలంగా ఉన్న పరిణామాలను గమనిస్తే ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే 2022-23 లో పసిడి ఆభరణాల రిటైలర్ల ఆదాయం 12-15 శాతం పెరుగుతాయి. ఇదే సమయంలో ఈ ఆదాయ వృద్ధి ప్రస్తుతం అంచనా వేసిన దానికంటే ఎక్కువగానే ఉండేదని, రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం వల్ల పది గ్రాముల బంగారం రూ. 55 వేలకు పెరిగింది. నిరంతర అస్థిరత కారణంగా కొనుగోళ్లు స్వల్పంగా క్షీణించాయి.

ఈ కారణంగానే వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జరిగే పెళ్లిళ్లు, పండుగ సీజన్‌లకు ఆభరణాల అమ్మకాలు తగ్గే అవకాశం ఉందని ' క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అనూజ్ సేథి అన్నారు. ప్రస్తుత ప్రతికూల పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత రానున్న రోజుల్లో ఆభరణాల డిమాండ్ 8-10 శాతం వృద్ధి నమోదవొచ్చని క్రిసిల్ అభిప్రాయపడింది. కాగా, బుధవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,980 ఉండగా, ఆభరణాల్లో వాడే 22 క్యారెట్ల పసిడి ధర రూ. 47,650గా ఉంది.

Next Story

Most Viewed