భారీగా తగ్గిన రిలయన్స్ జియో సబ్‌స్క్రైబర్లు!

by Web Desk |
భారీగా తగ్గిన రిలయన్స్ జియో సబ్‌స్క్రైబర్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ టెలికాం రంగంలో వేగంగా దూసుకెళ్తున్న రిలయన్స్ జియోకు సబ్‌స్క్రైబర్లు షాక్ ఇచ్చారు. 2021, డిసెంబర్ నెలకు సంబంధించి టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ గురువారం వెల్లడించిన గణాంకాల ప్రకారం జియో యూజర్లు భారీగా తగ్గారు. సమీక్షించిన నెలలో టెలికాం కంపెనీలు సగటున 20 శాతం టారిఫ్ ధరలు పెంచిన నేపథ్యంలో వినియోగదారులు పెద్ద సంఖ్యలో నెట్‌వర్క్‌లను మారినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో రిలయన్స్ జియో 1.29 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయి మొత్తం చందాదారుల సంఖ్య 41.57 కోట్లకు చేరుకుందని ట్రాయ్ గణాంకాలు పేర్కొన్నాయి. అలాగే, వొడాఫోన్ ఐడియా సైతం 16.14 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను పోగొట్టుకోవడంతో 26.55 కోట్ల వినియోగదారులను కలిగి ఉంది. ఇదే సమయంలో మరో దిగ్గజ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ మాత్రం అత్యధిక సబ్‌స్క్రైబర్లను సంపాదించుకుంది. డిసెంబర్ నెలలో ఎయిర్‌టెల్ మొత్తం 4.75 లక్షల మందిని సాధించడంతో మొత్తం 35.57 కోట్ల మంది వినియోగదారులను పెంచుకుంది.

కాగా, సమీక్షించిన నెలలో దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారుల సంఖ్య 1.28 కోట్లు తగ్గి 115 కోట్లకు పడిపోయిందని ట్రాయ్ వెల్లడించింది. డిసెంబర్‌లో ఎయిర్‌టెల్ మార్కెట్ వాటా 30.81 శాతం, వొడాఫోన్ ఐడియా 23 శాతానికి పెరిగాయి. అయితే, జియో మాత్రం 36 శాతానికి తగ్గిందని ట్రాయ్ పేర్కొంది. జియో గ్రామీణ ప్రాంతాల్లో 60 లక్షల మంది వినియోగదారులను కోల్పోగా, ఎయిర్‌టెల్ 11.8 లక్షలు, వొడాఫోన్ ఐడియా 9.7 లక్షల మంది గ్రామీణ వినియోగదారులను పోగొట్టుకున్నాయి.


Next Story