కన్నడ ప్రజలకు బేషరతుగా రణ్‌వీర్‌ సింగ్‌ క్షమాపణలు

by Muthe.Rajitha |

బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ కన్నడ ప్రజలకు భేషరతుగా క్షమాపణలు చెప్పేందుకు ప్రమాణపత్రాన్ని కోర్టులో దాఖలు చేసారు.

కన్నడ ప్రజలకు బేషరతుగా రణ్‌వీర్‌ సింగ్‌ క్షమాపణలు
X

దిశ, వెబ్ డెస్క్ : 'కాంతార' చిత్రంలోని భూత కోల పాత్రను ఉద్దేశించి బాలీవుడ్ నటుడు రణ్‌వీర్‌ సింగ్ చేసిన హావభావాలు, వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ రణ్‌వీర్ దాఖలు చేసిన పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టులో కీలక విచారణ జరిగింది. తన ప్రవర్తన వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని గుర్తించిన రణ్‌వీర్ సింగ్, కోర్టుకు ఒక సమగ్రమైన క్షమాపణ పత్రాన్ని సమర్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ వివాదానికి శాశ్వత ముగింపు పలికే దిశగా రణ్‌వీర్ సింగ్ తన తరఫు న్యాయవాదుల ద్వారా ఈ అఫిడవిట్‌ను సిద్ధం చేస్తున్నారు.

పశ్చాత్తాపం లేని లేఖ.. మరోసారి వివాదం

గతంలో రణ్‌వీర్ సమర్పించిన క్షమాపణ లేఖలో తగినంత పశ్చాత్తాపం లేదని, కేసు పెట్టడమే తప్పన్నట్టు ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టులో వాదించారు. ఈ వాదనను పరిగణనలోకి కోర్టు మరోసారి రణ్‌వీర్ కు నోటీసులు జారీ చేయగా.. ఫిర్యాదుదారులకు, వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదులకు సంతృప్తి కలిగించే భాషలో, బాధ్యతతో కూడిన కొత్త ప్రమాణపత్రాన్ని దాఖలు చేస్తామని రణ్‌వీర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం "తాను సింధీ కుటుంబంలో పెరగడం వల్ల, స్థానిక దైవారాధనలోని తీవ్రతను, దాని వెనుక ఉన్న ఘనమైన సాంప్రదాయాలను మొదట్లో అర్థం చేసుకోలేకపోయాను" అని రణ్‌వీర్ తన తాజా ప్రమాణపత్రంలో పేర్కొన్నారు. ఇది ఉద్దేశపూర్వకమైనది కాదని, కేవలం అవగాహన లోపం వల్ల జరిగిందని, కన్నడ ప్రజలు, భక్తులు తనను మన్నించాలని వివరణ ఇచ్చారు.

తన భక్తిని నిరూపించుకునేందుకు ఈ నెల 18న మైసూరులోని ప్రసిద్ధ చాముండేశ్వరి దేవి ఆలయాన్ని సందర్శించి, బహిరంగ క్షమాపణలు చెబుతానని కూడా రణ్‌వీర్ ప్రకటించారు. ఈ వ్యవహారంలో హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది. రణ్‌వీర్ సింగ్ వ్యక్తం చేసిన బేషరతు క్షమాపణను అంగీకరించగా.. ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందా లేదా అనేది చూడాలి.

Next Story