రామోజీరావు కీర్తి అజరామరం: సీఎం చంద్రబాబు

by Malleboina Mahesh |   (  Updated:2026-06-08 03:30:25  IST  )

రామోజీరావు 2వ వర్ధంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు.

రామోజీరావు కీర్తి అజరామరం: సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: రామోజీరావు ద్వితీయ వర్ధంతి (Ramoji Rao's second death anniversary) సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు ఘన నివాళులర్పించారు. ఎక్స్ వేదికగా స్పందించిన చంద్రబాబు.. ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఆయన తన ట్వీట్ లో "తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు, పత్రికా-మీడియా రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపిన యుగకర్త, అక్షర యోధుడు రామోజీరావు ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. తన భావోద్వేగ సందేశాన్ని పంచుకుంటూ రామోజీరావుతో ఉన్న అనుబంధాన్ని, దేశానికి ఆయన చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు.

ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన రామోజీరావు తన అద్భుతమైన మేధస్సు, కష్టపడే తత్వంతో అసామాన్య శిఖరాలను అధిరోహించారని సీఎం కొనియాడారు. కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా, మీడియాను ప్రజా చైతన్యానికి ఒక బలమైన వేదికగా మలిచిన ఘనత ఆయనకే దక్కుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. సమాజ హితం కోసం ఆయన చేసిన సేవలు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు.

పత్రికా రంగం అంటే కేవలం లాభాలు ఆర్జించే వ్యాపారం కాదని, అదొక సామాజిక బాధ్యత అని రామోజీరావు నమ్మడమే కాకుండా, దానిని తన జీవితాంతం ఆచరించి చూపిన గొప్ప ఆదర్శవాది అని సీఎం ప్రశంసించారు. విలువలు, క్రమశిక్షణ, నిబద్ధత, అచంచలమైన ధైర్యసాహసాలతో సాగిన ఆయన జీవిత ప్రస్థానం తరతరాల యువతకు, జర్నలిస్టులకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా గర్వించే విధంగా అత్యున్నత ప్రమాణాలతో కూడిన మీడియా సంస్థలను మనకు అందించిన రామోజీరావు స్థానం ప్రజల హృదయాలలో శాశ్వతంగా ఉంటుందని, ఆయన కీర్తి అజరామరమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని ఆశయాలను ప్రతి ఒక్కరం స్మరించుకుందామని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

Next Story