తగ్గేదేలే అంటున్న కబ్జా రాయుళ్లు..

by Disha Web Desk 12 |
తగ్గేదేలే అంటున్న కబ్జా రాయుళ్లు..
X

దిశ, మియాపూర్: కొంతమంది భూబకాసురులు ఒక స్థలం పై గురి పెట్టారంటే ఎన్ని ఎత్తుగడలు వేసైనా తమ వశం అయ్యేంత వరకు పట్టువదలని విక్రమార్కుల్లా ఎంతకైనా తెగిస్తారు అనేందుకు మచ్చుకు ఉదాహరణ ఇది. మియాపూర్ డివిజన్ లోని మక్త మహబూబ్ పేట్ చెరువు (కింది కుంట ) సర్వే నెంబర్ 121 , 24 ఎకరాల విస్తీర్ణం ఉన్నది దీనిపై పై కొంతమంది రియల్ వ్యాపారుల నజర్ పడింది. దీంతో గత కొన్ని రోజులుగా రోడ్డు ఏర్పాటు చేసేందుకు కొంతమంది పలుమార్లు విఫల ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. రెండు నెలల కిందట ఒకసారి, వారం కిందట మరోసారి, చివరగా బుధవారం రాత్రి మరోసారి గుట్టు చప్పుడు కాకుండా మట్టి తీసుకొచ్చి చెరువు కట్టపై పోసీ రోడ్డు ఏర్పాటునైతే పూర్తి చేశారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా చివరకు రెవెన్యూ అధికారులు సదరు వ్యక్తుల పై మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. కొంతమంది పెద్ద రియల్ వ్యాపారుల స్థలాలు చెరువు పై భాగంలో ఉండడంతో రాత్రి కి రాత్రి రోడ్డు ఏర్పాటు చేసి అక్కడ బడా నిర్మాణాలు చేపట్టి సొమ్ము చేసుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

తలొగ్గుతారా అడ్డుకుంటారా మిలియన్ డాలర్ల ప్రశ్న.?

ఎవరు ఎన్ని అవాంతరాలు సృష్టించినా తమ పని తాము చూసుకుంటామని సదరు ఆక్రమణ దారులు నిరూపించారు. అది కూడా బఫర్ జోన్ లో నీళ్ళు చెరువులోకి సాఫీగా వెళ్ళే మార్గానికి అడ్డుకట్ట వేసి పైపులు వేశారు. ఇంత జరిగినా ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారనేది తెలియని విషయం. చివరకు అ రోడ్డును తొలగిస్తారా అన్ని చెరువుల మాదిరిగానే ఇది కూడా అన్యాక్రాంతం జాబితాలో చేరనున్నదో మిలియన్ డాలర్ల ప్రశ్న గా మిగిలిపోనున్నది.

అక్రమార్కులు ఎవరైనా వదిలేది లేదు..

మక్త చెరువు కబ్జా విషయంలో సదరు వ్యక్తులు కోర్టు నుంచి స్టే తీసుకొచ్చి రాత్రికి రాత్రి రోడ్డు ఏర్పాటు చేశారు. మా తరపున కోర్టు నుంచి వెకేషన్ ఆర్డర్ రాగానే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. శ్రీనయ్య .. ఆర్ ఐ.. శేరిలింగంపల్లి తెలిపారు.



Next Story

Most Viewed