- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరణం తర్వాత బ్యాంకు సొమ్ము వారసులకు అందాలంటే.. అనుసరించాల్సిన ప్రక్రియ ఇదే!
ఖాతాదారుడు మరణించిన తర్వాత బ్యాంకు డబ్బును పొందే పద్ధతులపై అవగాహన కల్పించే కథనం. ఒడిశా అస్థిపంజరం ఘటన నేపథ్యంలో బ్యాంకింగ్ నిబంధనలు, నామినేషన్ ప్రాముఖ్యతపై పూర్తి వివరాలు

దిశ, బిజినెస్ బ్యూరో : ఇటీవల ఒడిశా లో జరిగిన ఒక విచిత్ర ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరణించిన తన సోదరి డబ్బు తీసుకోవడానికి ఒక వ్యక్తి ఆమె అస్థిపంజరాన్ని బ్యాంకుకు తీసుకెళ్లాడనే వార్త పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. అయితే పూర్తి వివరాలు బయటకు రావడంతో ఇది కేవలం ఆ వ్యక్తి భావోద్వేగ చర్య మాత్రమే కాకుండా, బ్యాంకింగ్ నిబంధనలపై అవగాహన లేకపోవడమని తేలింది. సోషల్ మీడియాలో వచ్చిన మొదటి కథనాల ప్రకారం.. బ్యాంకు అధికారులు మరణానికి రుజువుగా అస్థిపంజరం తీసుకురావాలని కోరారని ప్రచారం జరిగింది.
అయితే, తర్వాత ఇది పూర్తిగా తప్పు అని బ్యాంక్ స్పష్టం చేసింది. వాస్తవానికి సదరు మహిళ సోదరుడు ఎలాంటి అధికారిక పత్రాలు లేకుండా ఖాతాలోని డబ్బు విత్డ్రా చేసుకోవడానికి ప్రయత్నించాడు. డెత్ సర్టిఫికెట్, వారసత్వానికి సంబంధించిన రుజువులు లేకపోవడంతో బ్యాంకు విత్డ్రా ప్రక్రియను ప్రాసెస్ చేయలేకపోయింది. అయితే, వివరాలు వెలుగులోకి వచ్చే కొద్దీ, ఖాతాదారుడి మరణం తర్వాత బ్యాంకింగ్ నిబంధనలు ఎలా పనిచేస్తాయి, సరైన పత్రాలు లేనప్పుడు ఏం జరుగుతుంది. అనేదానికి ఈ కేసు ఒక ఉదాహరణగా నిలిచింది.
బ్యాంక్ ఎందుకు తిరస్కరించింది?..
బ్యాంకింగ్ వ్యవస్థలో ఒక ఖాతాదారుడు మరణించిన తర్వాత ఆ ఖాతా సాధారణ లావాదేవీలకు అందుబాటులో ఉండదు. అది క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియలోకి మారుతుంది. సరైన పత్రాలు లేకపోవడంతో, బ్యాంక్ ఆ అభ్యర్థనను ప్రాసెస్ చేయలేకపోయింది. మరణాన్ని నిరూపించే ప్రయత్నంలో ఆ వ్యక్తి అస్థిపంజర అవశేషాలను తీసుకువచ్చాడు. అయితే ఈ చర్య చట్టబద్ధంగా చెల్లుబాటు కాదు, బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం అవసరం కూడా లేదు. ఈ ఘటన కాస్త వైరల్ కావడంతో అధికారులు రంగంలోకి దిగి, అవసరమైన పత్రాలను జారీ చేశారు. క్లెయిమ్ ప్రాసెస్ను పూర్తి చేశారు. ఈ కేసులో సమస్య మరింత క్లిష్టంగా మారడానికి ప్రధాన కారణాలు ఇవే.
- మరణించిన మహిళ అకౌంట్కు నామినీ కూడా ఇప్పటికే మరణించడం.
- చెల్లుబాటు అయ్యే వారసుడి రికార్డు లేకపోవడం.
- అవసరమైన పత్రాలు సమర్పించకపోవడం.
మరణం తర్వాత ఎలా?..
ఒక ఖాతాదారుడు మరణించిన తర్వాత, ఆ అకౌంట్ను సాధారణ అకౌంట్గా పరిగణించరు. నిధులకు సంబంధించిన ఏదైనా యాక్సెస్ కేవలం డబ్బు విత్డ్రా చేసుకునే పనిగా కాకుండా, క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియగా మారుతుంది. అందుకోసం బ్యాంకులు కొన్ని నిర్దిష్ట పత్రాలను తప్పనిసరిగా అడుగుతాయి. ఇవి లేకుండా క్లెయిమ్ ప్రాసెస్లో వాస్తవాలే ఉన్నప్పటికీ, సొమ్మును విడుదల చేయడానికి బ్యాంకులకు అనుమతి ఉండదు.
- డెత్ సర్టిఫికెట్
- నామినీ లేదా చట్టపరమైన వారసుడికి సంబంధించిన రుజువు.
- క్లెయిమ్ చేసేవారి ఐడెంటిటీ వెరిఫికేషన్.
నామినేషన్ వర్సెస్ ఉమ్మడి ఖాతా..
ఈ ఘటన మరో ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తింది. నామినీ ఉంటే సరిపోతుందా? లేక ఉమ్మడి ఖాతా మంచిదా?. ఇలాంటి సమస్యలను నివారించడానికి ‘ఇద్దరిలో ఒకరు లేదా బతికి ఉన్నవారు’(ఈదర్ ఆర్ సర్వైవర్) పద్ధతిలో ఉమ్మడి ఖాతాను తెరవడం ఒక మార్గమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, నామినేషన్ కూడా చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరు ఉమ్మడి ఖాతా తెరవాలని అనుకోవడం అవసరం లేదు. అలాంటి సందర్భాల్లో, నామినీ ఉండటం క్లెయిమ్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
అవగాహన లోపం..
ఈ సంఘటన మరో పెద్ద వాస్తవాన్ని కూడా బహిర్గతం చేసింది. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ రూల్స్పై సరైన అవగాహన లేకపోవడం. డాక్యుమెంట్లు ఎలా సిద్ధం చేయాలి, క్లెయిమ్ ఎలా దాఖలు చేయాలి? అనే విషయాల్లో స్పష్టత లేకపోవడంతో నిజమైన హక్కుదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకులు మోసాలను నివారించడానికి, డబ్బు సరైన లబ్ధిదారులకు అందించేందుకు కఠిన నిబంధనలు పాటిస్తాయి. కానీ పత్రాలు లేనప్పుడు లేదా ప్రక్రియలు అర్థం చేసుకోలేని సందర్భాల్లో నిజమైన క్లెయిమ్లు కూడా ఆలస్యం కావచ్చు.






