కాకినాడ సిటీ ఎమ్మెల్యే వ్యాఖ్యలకు నాదెండ్ల మనోహర్ కౌంటర్

by Disha Web |
కాకినాడ సిటీ ఎమ్మెల్యే వ్యాఖ్యలకు నాదెండ్ల మనోహర్ కౌంటర్
X

దిశ, ఏపీ బ్యూరో : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను వచ్చే ఎన్నికల్లో ఓడించి తీరుతానని ప్రకటించిన వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్‌ను ఓడించడం అటుంచితే ముందు నువ్వు గెలవవు అన్న విషయం తెలుసుకో అంటూ హెచ్చరించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం నుంచి నాదెండ్ల మనోహర్ ఓ వీడియో విడుదల చేశారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం అని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో వైసీపీకి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రగల్భాలు మాని.. కాకినాడ అభివృద్ధిపై దృష్టి పెట్టాలి అని హితవు పలికారు. రాజకీయాల్లో అంతా ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని, కానీ ప్రజాస్వామ్యాన్ని కాలరాసే విధంగా వైసీపీ పాలన సాగుతోందని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. అధికారంలో ఉన్నాం.. ఏం మాట్లాడినా, ఏం చేసినా చెల్లిపోతుంది అనుకుంటే పొరపాటే. త్వరలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి . ఆ ఎన్నికల్లో ప్రజలే తమ ఓటుతో బుద్ధి చెబుతారు. వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా మళ్లీ అధికారంలోకి రాదు అని హెచ్చరించారు.

అంత అహంకారం పనికిరాదు

కాకినాడ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలు చూసి తాను ఆశ్చర్యానికి గురైనట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు.'ఇంత అహంకారం ఎక్కడ నుంచి వచ్చిందో అర్థం కావడం లేదు. ఆయన పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలుకుతున్నారు. మా పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్‌ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. గతంలో కూడా అనవసరంగా ఇలాంటి సమస్యలే సృష్టించారు. మా నాయకత్వాన్ని చులకన చేసే విధంగా మాట్లాడితే సహించేది లేదు. మీరు ఒక శాసనసభ్యుడిగా సమయం వృధా చేసుకోకుండా.. కాకినాడ అభివృద్ధిపై దృష్టి పెట్టండి.పేదలకు ఇస్తామన్న ఇళ్ల పట్టాలపై మాట్లాడండి. డంపింగ్ యార్డుల్లా మారిన మత్స్యకార గ్రామాల గురించి మాట్లాడండి. పర్యావరణానికి జరుగుతున్న నష్టంపై మాట్లాడండి. బలవంతంగా చెత్త పన్ను వసూలు చేయడానికి బ్యానర్లు కట్టుకొని తిరిగారే.. అది మీ అహంకారానికి నిదర్శనం అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఓడించేందుకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అవసరం లేదని ముత్తా శశిధర్ చాలని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో ముత్తా శశిధర్ చేతిలో ద్వారంపూడి ఓటమి తప్పదు అని హెచ్చరించారు. 'ప్రజాస్వామ్యంలో అంతిమ తీర్పు ప్రజలదే. ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న వైసీపీకి రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా ప్రజలే బుద్ధి చెబుతారు. దయచేసి ఇప్పటికైనా వ్యక్తిగత విమర్శలు మానుకొని.. కాకినాడ అభివృద్ధికి సమయం కేటాయిస్తే ప్రజలు కొంతవరకైనా హర్షిస్తారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ద్వారంపూడి గెలిచే పరిస్థితి లేదు. ఆయనపై ముత్తా శశిధర్ ఘన విజయం సాధించి తీరుతారు. మా నాయకులు ఇప్పటికే ఆ ప్రాంతంలో బలంగా పనిచేస్తున్నారు. గతంలో మా వీర మహిళలను ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గాయపరిచారు. రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వాళ్ల ఇంటింటికి వెళ్లి ప్రజల ద్వారా సరైన గుణపాఠం చెబుతారు' అని పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు.



Next Story