వరి కొనకపోతే ఉరికించి కొడతాం: ఎంపీ రంజిత్ రెడ్డి

by Disha Web |
వరి కొనకపోతే ఉరికించి కొడతాం: ఎంపీ రంజిత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో పండిన యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే బీజేపీని ఉరికించి కొడతామని ఎంపీ రంజిత్​రెడ్డి హెచ్చరించారు. ఢిల్లీ ధర్నా వేదిక ఏర్పాట్లను ఆయన శనివారం ఎంపీ లు కేకే, నామ నాగేశ్వరరావు, టీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ కేంద్రం అనుసరిస్తున్న విధానం తోనే ఢిల్లీలో ధర్నా చేపట్టాల్సి వచ్చిందని మండిపడ్డారు. సామరస్యంగా పరిష్కరించుకుందాం అనుకుంటే కేంద్రమే పొడిగిస్తూ ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమం దృష్ట్యా టీఆర్ఎస్ ఉద్యమబాట చేపట్టిందన్నారు.

ధాన్యం కొనుగోలు పై పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రైతులను అవమానపరిచే విధంగా ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించాలని అలవాటు చేయాలనడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితిలో లేదని ముందే చెప్పామని, వరి వేయొద్దని రైతులను కోరామన్నారు. అయినా బీజేపీ నేతలు వరి వేయాలని కొనుగోలు చేయిస్తామని రైతులను రెచ్చగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరా ఇప్పుడు మొహం చాటేశారు అని మండిపడ్డారు. ధర్నాకు క్యాబినెట్, ఎంపీలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డిసిసిబి చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొంటున్నారని తెలిపారు.

Next Story

Most Viewed