మారుతీ సుజుకి నుంచి సీఎన్‌జీలో కొత్త 'డిజైర్' మోడల్‌

by Disha Web Desk 17 |
మారుతీ సుజుకి నుంచి సీఎన్‌జీలో కొత్త డిజైర్ మోడల్‌
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ మారుతీ సుజుకి ఇండియా(ఎంఎస్ఐ) మంగళవారం తన కాంపాక్ట్ సెడాన్ డిజైర్ మోడల్‌లో సీఎన్‌జీ టెక్నాలజీ వేరియంట్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర విఎక్ఐ వేరియంట్ రూ. 8.14 లక్షలతో తీసుకొచ్చామని, హై-ఎండ్ వేరియంట్ జెడ్ఎక్స్ఐ రూ. 8.82 లక్షల వద్ద లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ మోడల్ కోసం బుకింగ్స్ ప్రారంభించామని, కొనుగోలుదారులు డీలర్ల వద్ద రూ. 11,000 అడ్వాన్స్ రూపంలో చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. దేశీయంగా సీఎన్‌జీ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ వరుసగా సీఎన్‌జీ మోడల్స్‌ను మార్కెట్లోకి తీసుకొస్తోంది.

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో డిజైర్ మోడల్‌కు వినియోగదారుల నుంచి అద్భుతమైన ఆదరణ ఉంది. కంపెనీ ఇప్పటికే మారుతి ఆల్టో, మారుతి ఎస్-ప్రెస్సో, వ్యాగన్ఆర్, మారుతీ ఎకో, మారుతీ సెలెరియో, ఎర్టిగా మోడళ్లను సీఎన్‌జీ వేరియంట్‌లో విక్రయిస్తోంది. ఈ జాబితాలో ఇప్పుడు డిజైర్‌ను కూడా తీసుకొచ్చింది. అన్ని రకాల రహదారుల్లో మెరుగైన డ్రైవింగ్ సౌకర్యాన్ని, పనితీరును ఈ కారు కలిగి ఉంటుందని, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే ఈ మోడల్ కిలోకు 31.12 మైలేజ్ ఇస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఫీచర్ల పరంగా ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేతో పాటు ఆటోమెటిక్ క్లైమెట్ కంట్రోల్, డ్యుయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్, బ్రేక్ అసిస్ట్ లాంటి అనేక అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.


Next Story

Most Viewed