సూర్యాపేట జిల్లాలో బోణి కొట్టిన జనసేన

by Malleboina Mahesh |   (  Updated:2026-02-13 06:02:27  IST  )

నేరేడుచర్లలో జనసేన ఖాతా ఓపెన్! హోరాహోరీ పోరులో 14వ వార్డును కైవసం చేసుకున్న జనసేన అభ్యర్థి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో శుభారంభం చేసిన పవన్ కళ్యాణ్ సేన.

సూర్యాపేట జిల్లాలో బోణి కొట్టిన జనసేన
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 200 లకు పైగా స్థానాల్లో పోటీలో నిలిచిన జనసేన పార్టీ (Janasena Party).. ఎట్టకేలకు బోణి కొట్టింది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో జనసేన పార్టీ అభ్యర్థి.. హోరాహోరీగా జరిగిన 14వ వార్డు ఎన్నికల్లో సమీప ప్రత్యర్థిపై విజయం సాధించారు. దీంతో జనసేన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. తెలంగాణ గడ్డపై మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన జనసేనకు ఇది కీలక విజయంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నేరుగా పాల్గొనక పోయినప్పటికీ, స్థానిక నాయకత్వం, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో చేసిన కృషి ఈ విజయానికి దోహదపడింది. ముఖ్యంగా యువత, మార్పు కోరుకునే ఓటర్లు జనసేన వైపు మొగ్గు చూపడం ఈ ఫలితంతో స్పష్టమైంది. ఈ విజయం నేరేడుచర్ల పరిధిలోని జనసేన కార్యకర్తల్లో కొత్త ఉత్తేజాన్ని నింపింది. తెలంగాణలో బలపడాలని చూస్తున్న జనసేనకు ఈ వార్డు విజయం ఒక మంచి ఆరంభమని చెప్పవచ్చు.

Next Story