సీఎం కేసీఆర్ పై ఇక అంతిమ యుద్ధమే: మందకృష్ణ మాదిగ

by Disha Web Desk 12 |
సీఎం కేసీఆర్ పై ఇక అంతిమ యుద్ధమే: మందకృష్ణ మాదిగ
X

దిశ, నల్లగొండ: రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన కేసీఆర్ దళితుల ప్రథమ శత్రువని, ఆయన పై అంతిమ యుద్ధం తప్పదని మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. నల్లగొండ జిల్లా కేంద్రం లక్ష్మీ గార్డెన్‌లో రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్ మాదిగ అధ్యక్షత వహించగా, మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరై సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు.

93 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజల హక్కులకు భంగం కలిగిస్తూ, రాజ్యాంగాన్ని, మహిళలను గౌరవించని కేసీఆర్‌కు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఏడు శాతం ఉన్న అగ్రవర్ణాలు శాసిస్తున్నాయని, అరశాతం ఉన్న వెలమలకు 4 మంత్రి పదవులా అని ప్రశ్నించారు. ఏప్రిల్ 4న జరిగే యుద్ధభేరి తో కేసీఆర్ రాజకీయానికి పాతరేస్తామని హెచ్చరించారు. రాజ్యాధికారం హక్కుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల హక్కులను కొల్లగొట్టి అగ్రవర్ణాలకు దోచి పెడుతున్నారని ఆరోపించారు.

జనాభా లో అర శాతం ఉన్న వెలమలకు తెలంగాణ క్యాబినెట్ లో నాలుగు మంత్రి పదవులు ఉన్నాయని అన్నారు. కొత్త రాజ్యాంగం రాయాలని కుట్ర పన్నుతున్న సీఎం కేసీఆర్ ఆటలు సాగనివ్వబోమని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల తడాఖా చూపిస్తామని అన్నారు. రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీ ని సమాధి చేస్తామని హెచ్చరించారు. రాజ్యాంగానికి ప్రథమ శత్రువు కేసీఆర్ అని మండిపడ్డారు. రాజ్యాంగం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిరంకుశ కేసీఆర్ వెంటనే భారత సమాజానికి, డా. బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్‌కు క్షమాపణ చెప్పేవరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ప్రముఖ అంబేద్కర్ వాది జే.బి రాజు, టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు పన్నాల గోపాల్ రెడ్డి, హోలీయ దాసరి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టం టం రాజు, మాలమహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోలి సైదులు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు వైద్యుల సత్యనారాయణ, వెంకన్న గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed