ప్రజల సహకారంతోనే వ్యాక్సినేషన్ విజయవంతం.. మోడీ

by Disha Web Desk 17 |
ప్రజల సహకారంతోనే వ్యాక్సినేషన్ విజయవంతం.. మోడీ
X

న్యూఢిల్లీ: దేశ ప్రజల సహకారంతోనే వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతంగా కొనసాగుతుందని ప్రధాని మోడీ అన్నారు. బుధవారం 12-14 ఏళ్ల వారికి టీకా పంపిణీ ప్రారంభించిన నేపథ్యంలో ఆయన ప్రసంగించారు. 'మన పౌరులకు టీకాలు వేయడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలలో నేడు(బుధవారం) ముఖ్యమైన రోజు. ఇప్పటినుంచి 12-14 ఏళ్ల వారికి వ్యాక్సిన్‌తో పాటు 60 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్ డోసు ఇవ్వనున్నాం. ఈ వయస్సు వారంతా వ్యాక్సిన్ తీసుకోవాలని నేను కోరుతున్నాను' అని తెలిపారు. ఏడాది కాలంగా దేశంలో వ్యాక్సినేషన్ ప్రజల సహకారంతో విజయవంతంగా సాగుతుందని మోడీ అన్నారు.

ఇతర దేశాల వలె కాకుండా వ్యాక్సిన్ తీసుకోవడానికి చాలా భయపడుతున్నారని, వ్యాక్సిన్ తీసుకోవడమే కాకుండా ఇతరులను తీసుకునేలా ప్రోత్సహించాలని మోడీ కోరారు. భారత టీకా కార్యక్రమాన్ని సైన్స్ ఆధారితమని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు కారణమైన శాస్త్రవేత్తలు, అవిష్కర్తల ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. ఇదే సమయంలో ప్రైవేటు రంగం కూడా పురోగతి సాధించడం అభినందనీయమని అన్నారు. కాగా, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 180 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేశామని తెలిపారు. వీరిలో 15-17 ఏళ్ల వారికి 9 కోట్ల డోసులు, ప్రికాషన్ డోసులు 2 కోట్లు అందించామని చెప్పారు.


Next Story

Most Viewed