గోషామహల్‌లో టీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. పార్టీకి కీలక నేత రాజీనామా..

by Disha Web Desk 19 |
గోషామహల్‌లో టీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. పార్టీకి కీలక నేత రాజీనామా..
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్: గోషామహల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తాకింది. టీఆర్ఎస్‌కు చెందిన సీనియర్ నాయకుడు గోవిండ్ రాఠి పార్టీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామాను ఫ్యాక్స్ ద్వారా సీఎంకు పంపనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు బుధవారం కోఠిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోవింద్ రాఠి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌పై నమ్మకంతో తాను 2018లో బీజేపీ నుండి టీఆర్ఎస్‌లో చేరి.. పార్టీ అభివృద్ధికి తాను ఎంతగానో కృషి చేసినట్లు తెలిపారు. అయితే గత మూడేళ్లుగా సీఎంతో పాటు ఇతర పార్టీ నాయకులు హిందూ మతాన్ని కించ పరిచే వ్యాఖ్యలు చేయడంతో తన మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు.


ఇది సెక్యులర్ పార్టీకి అవమానకరమన్నారు. ప్రస్తుతం సీఎం వ్యాఖ్యలు చూస్తోంటే ఆయన మానసిక సమతుల్యత కోల్పోయినట్లుగా కనబడుతోందని అన్నారు. ఈ నెల 8వ తేదీన వనపర్తి మహా సభలో సీఎం మాట్లాడుతూ.. కాషాయ జెండానే బంగాళాఖాతంలో పారవేస్తానని అనడం చూస్తోంటే ఆయన మాటలు సనాతన హిందూ ధర్మానికి పెద్ద దెబ్బగా తాను భావిస్తున్నానని చెప్పారు. లౌఖిక వాదిగా చెప్పుకుంటూ ఇతర మతాల జెండాలపై ఆయన మాట్లాడడం లేదని, ఇదంతా మైనార్టీ ఓటు బ్యాంక్ పొందడం కోసమేనని విమర్శించారు. ఇటీవల ముఖ్యమంత్రి కాషాయ జెండాను అవమానిస్తూ చేసిన ప్రకటనకు క్షమాపణ చెప్పడంతో పాటు ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని గోవింద్ రాఠి డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో మనోజ్ జైశ్వాల్, బాబుగురు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed