ముఖ్యమంత్రిలో ఫుల్ ఫ్రస్టేషన్.. ఈ ఒత్తిడికి కారణం అదేనా?

by Disha Web Desk 12 |
ముఖ్యమంత్రిలో ఫుల్ ఫ్రస్టేషన్.. ఈ ఒత్తిడికి కారణం అదేనా?
X

దిశ, ఏపీ బ్యూరో : కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడో లేక అక్రమాస్తుల ఆరోపణలతో జైలుకు వెళ్లినప్పుడో ఆయన చిరునవ్వుతోనే ఉన్నారు. 16 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చినప్పుడు లేక 3 వేల కిలోమీటర్ల పైచిలుకు దూరాన్ని పాదయాత్రతో అధిగమించినప్పుడు కూడా ఆయన ముఖంలో అలసట కనపడిందేమో కానీ చిరునవ్వు తొలగిపోలేదు. అధికారం చేపట్టి మూడేళ్లు పూర్తయ్యాక మాత్రం ఆయనలో అసహనం పెరుగుతున్నట్టు ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు . ఇటీవల ఆయన మాటల్లో కనిపిస్తున్న ఘాటు ముఖ్యమంత్రి జగన్‌ను ప్రజలకు కొత్త కోణంలో పరిచయం చేస్తుందంటున్నారు. దానికి నంద్యాలలో ఆయన మాట తీరును ఉదాహరణగా పేర్కొంటున్నారు.

''దౌర్భాగ్య విపక్షం, ఎల్లో మీడియా, దత్తపుత్రుడు ఉండటం ఈ రాష్ట్రం చేసుకున్న కర్మ దేవుడి దయ, ప్రజల చల్లని దీవెనలతో ఈ స్థానానికి వచ్చా. వీళ్లందరూ కలిసి నా వెంట్రుక కూడా పీకలేరని నంద్యాలలో సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అది కూడా ఏ రాజకీయ సమావేశంలోనూ ఎన్నికల ప్రచారం లోనో కాదు. విద్యార్థుల వసతి దీవెన కార్యక్రమంలో బహిరంగం గా చేసిన వ్యాఖ్యలివి. గురువారం పల్నాడులో వలంటీర్ల సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దొంగల ముఠా అని హైదరాబాద్ లో కూర్చుని ప్రభుత్వం పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇవన్నీ జగన్ వైఖరిలో కొద్దికాలంగా వచ్చినమార్పుగా విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో ఆయన పార్టీలో కొందరు ఇలాంటి వ్యాఖ్యలతో ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోస్తున్న జగన్ మాత్రం మాటల్లో ఎక్కడా ఒక్క దురుసు మాటా.. వాడిన సందర్భం లేదు. కానీ కొన్ని రోజులుగా మాత్రం ఆయన మాట తీరు మారింది అంటున్నారు నిపుణులు.

ఆర్థిక భారం పెరుగుతున్నందుకేనా..?

రాష్ట్ర అప్పులు రూ.7 లక్షల కోట్లు దాటాయి అని వైసీపీ నేతలే చెబుతున్నారు . దీనిపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలను ఆపేది లేదని జగన్ చెబుతున్నారు. అదే సమయంలో అభివృద్ధి జరగడం లేదని రాష్ట్రంపై విమర్శలొస్తున్నాయి. పన్నుల ద్వారా ఆదాయం వస్తున్నా అది వడ్డీలు కట్టడానికి, సంక్షేమ పథకాల కింద జనం చేతిలోకి వెళ్లిపోవడానికి సరిపోతున్నది. దానితో మళ్లీ కొత్త అప్పులు తేవాల్సిన పరిస్థితి ఉన్నది. రాష్ట్రంలో అప్పుల ఊబిలోకి వెళ్లిపోతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు.

అయినా ఈ సంక్షేమ పథకాల పులి స్వారీ నుంచి జగన్ కిందకు దిగే పరిస్థితి లేదని చెబుతున్నారు. తెలంగాణ కూడా నీటి వివాదాలతో రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నది. తాజాగా మంత్రుల రాజీనామాలతో సొంత పార్టీలోనూ అసమ్మతులు ఏర్పడుతున్నాయని సొంత పార్టీ నేతల నుంచి గుసగుసలు వినవస్తున్నాయి. ప్రస్తుతానికి ఇవి బాహాటంగా బయటపడకపోయినా ఒక్క సారి కొత్త మంత్రులు వచ్చాక మాజీలు ఎలా వారితో కలిసి పోతారో తెలియని సందిగ్ధత ఉండనే ఉంది. ఇవన్నీ జగన్‌పై ఒత్తిడి పెంచుతున్నాయంటున్నారు పరిస్థితులు గమనిస్తున్నవారు.

తాత్కాలికంగా అటకెక్కిన మూడు రాజధానులు

సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన మూడు రాజధానుల అంశం కోర్టు జోక్యం తో సైడ్ అయిపోయింది. ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్న త్వరలోనే మళ్లీ సమగ్రమైన చట్టాన్ని తెస్తామని సీఎం చెప్పారు. రాష్ట్రంలోని పరిణామాల నేపథ్యంలో అది మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. మండలి రద్దు తీర్మానం కూడా వెనక్కు తీసుకోవడంతో జగన్ మాట తప్పరు మండప తిప్పరు అన్న మాటకు ప్రతిబంధకంగా మారింది. ఇవన్నీ జగన్ పై ఫ్రస్టేషన్ పెంచడంతోనే ఆయన మాట తీరు మారిందని ప్రతిపక్ష నేతలు అంటున్నారు.

జనం నుంచి వస్తున్న వ్యతిరేకత

ప్రజల నుంచి కొన్ని అంశాలపై ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ప్రభుత్వం ఎంత సర్ది చెప్పుకున్నా ఇంటి పన్ను, నీటి పన్ను తో పాటు చెత్త పన్ను అనేవి ప్రజలకు భారంగా మారాయి. నచ్చజెప్పే ప్రయత్నాలకు బదులు ఏకంగా ఆస్తులు జప్తు చేస్తామని కొన్ని చోట్ల అధికారులు చేసిన అతి కాస్తా.. ప్రజల్లో కోపానికి కారణమైంది. తాజాగా పెంచిన విద్యుత్ ఛార్జీలు, కరెంట్ కోతలతో క్షేత్ర స్థాయిలో జనం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. విద్యుత్ డిస్కంల నుంచి వస్తున్న ఒత్తిళ్ల మేరకు ప్రభుత్వం భారం మోపక తప్పలేదు.

విపక్షాలు ఏకతాటిపైకి?

తమలో తాము ఎలా విభేదించుకుంటున్నా గానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును వచ్చే ఎన్నికల్లో విడదీయకూడదని రాష్ట్రంలోని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఏ అవకాశం వచ్చినా ప్రభుత్వం పై ముప్పేట విమర్శలు చేస్తూ జగన్ సర్కారును ఒత్తిడిలోకి నెడుతున్నాయి. దీంతో వైసీపీ ప్రభుత్వంలో అసహనం పెరుగుతుందని అందుకే జగన్ మాటల్లో ఎన్నడూ కనపడని ఘాటు, ఆగ్రహం వ్యక్తమవుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు.


Next Story

Most Viewed