కేరళ రాజకీయాల్లో ఈడీ ప్రకంపనలు.. ప్రతిపక్ష నేత పినరయి విజయన్ నివాసంలో సోదాలు

by Malleboina Mahesh |

కేరళలో ఈడీ అధికారులు 10 చోట్ల సోదాలు చేస్తున్నారు. సీఎంఆర్‌ఎల్ కేసులో ప్రతిపక్ష నేత పినరయి విజయన్ ఇల్లే లక్ష్యంగా తనిఖీలు సాగుతున్నాయి.

కేరళ రాజకీయాల్లో ఈడీ ప్రకంపనలు.. ప్రతిపక్ష నేత పినరయి విజయన్ నివాసంలో సోదాలు
X

దిశ, వెబ్ డెస్క్: కేరళ రాజకీయాల్లో బుధవారం ఉదయం ఈడీ రైడ్స్‌ (ED Rides)తో భారీ ప్రకంపనలు సృష్టించింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ (CMRL) అవినీతి కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు కేరళవ్యాప్తంగా ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత (LoP) పినరయి విజయన్ (Pinarayi Vijayan) నివాసం తో పాటు కేరళలోని దాదాపు 10 ప్రాంతాలలో ఈ తనిఖీలు కొనసాగుతున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. గత కొంతకాలంగా కేరళ రాజకీయాలను కుదిపేస్తోన్న సీఎంఆర్‌ఎల్ (CMRL) ఆర్థిక అక్రమాల వ్యవహారంలో ఈ సోదాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఇండస్ట్రియల్ మినరల్స్ కంపెనీ అయిన సీఎంఆర్‌ఎల్ నుంచి పినరయి విజయన్, ఆయన కుటుంబ సభ్యులకు పెద్ద ఎత్తున అక్రమంగా నిధులు చేరాయనే ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈ చర్యలకు దిగింది. బుధవారం ఉదయం నుంచే ఈడీ ప్రత్యేక బృందాలు కేరళలోని పలు కీలక ప్రాంతాల్లోని ప్రముఖుల ఇళ్లకు చేరుకుని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఈడీని వాడుకుంటూ ప్రతిపక్ష నేత ఇళ్లపై దాడులు చేయిస్తోందని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.

Next Story