ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి : డీజీపీ బి.శివధర్ రెడ్డి

by Muthe.Rajitha |

మున్సిపల్ ఎన్నికలను చట్టం ప్రకారం సమర్థవంతంగా నిర్వహించాలని డీజీపీ బి.శివధర్ రెడ్డి పోలీస్ అధికారులకు సూచించారు.

ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి : డీజీపీ బి.శివధర్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : మున్సిపల్ ఎన్నికలను చట్టం ప్రకారం సమర్థవంతంగా నిర్వహించాలని డీజీపీ బి.శివధర్ రెడ్డి పోలీస్ అధికారులకు సూచించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మున్సిపల్ ఎన్నికలు జరగనున్న ప్రాంతాల పోలీస్ కమీషనర్లు , జిల్లాల ఎస్పీలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (ఎస్హెచ్ఓ)లతో మాట్లాడారు. రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొత్తగూడెం, కరీంనగర్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నిజామాబాద్, నల్గొండ, రామగుండం కార్పొరేషన్ల పరిధిలోని 414 వార్డులతో పాటు, 116 మున్సిపాలిటీల్లోని 2,582 వార్డుల్లో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని పోలీస్ అధికారులకు సూచించారు.

ఈనెల 11వ తేదీన పోలింగ్, 13 తేదీన కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించి రాష్ట్ర పోలీస్ శాఖకు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఏ రకమైన ఫిర్యాదులు గాని ,అవాంఛనీయ సంఘటనలు గాని జరగకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీ స్పష్టం చేశారు. నిబంధనల మేరకు కఠినంగా వ్యవహరించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఓటర్లను ప్రభావితం చేయడం, మద్యం పంపిణీ, అనుమతి లేకుండా గోడలపై పోస్టర్లు అంటించినా, అశ్లీల ప్రకటనలు ప్రదర్శించిన, మత పరమైన అలజడులు సృష్టించిన కఠిన చర్యలు ఉంటాయాని పేర్కోన్నారు.

ఆయుధాల చట్టం ప్రకారం లైసెన్స్‌డ్ ఆయుధాలను కలిగి ఉన్న వారు నిబంధనల మేరకు పోలీస్ స్టేషన్లలో జమ చేయాలని, లేనిపక్షంలో మూడేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష విధించాలని నిబంధనలు ఉన్నాయన్నారు. హైదరాబాద్ పోలీస్ లీగల్ అడ్వైజర్ శ్రీ రాములు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన చట్టాల గురించి సమావేశంలో వివరించారు. డిస్ఫిగర్మెంట్ చట్టం-1997, మోటార్ వాహనాల చట్టం-1988 , మతపరమైన సంస్థల దుర్వినియోగ నిరోధక చట్టం-1988, తెలంగాణ మున్సిపాలిటీల చట్టం-2019లు వివరించారు.

Next Story