- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్యూమరేషన్ ఫారంల సమర్పణకు సమీపించిన గడువు : కలెక్టర్ ఇలా త్రిపాఠి
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారంల సమర్పణకు గడువు ముగియనున్న నేపథ్యంలో ఓటర్లు త్వరితగతిన తమ ఫారంను బీఎల్ఓలకు అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారంల సమర్పణకు గడువు ముగియనున్న నేపథ్యంలో ఓటర్లు త్వరితగతిన తమ ఫారంను బీఎల్ఓలకు అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. వివరాలను డిజిటలైజ్ చేయాల్సి ఉందన్నారు. అంతేకాకుండా ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్/డిలీటెడ్ (ఏ.ఎస్.డీ)ఓటర్ల జాబితాను సైతం రూపొందించాల్సి ఉన్నందున చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటదివెంట ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్ఓలకు అందించాలని అన్నారు. ప్రత్యేకించి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం పరిధిలోని ఓటర్లు ఫారం అందజేసే విషయంలో తాత్సారం చేయవద్దని సూచించారు. ఎన్యూమరేషన్ ఫారం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే ఓటరు జాబితా నుండి పేరు గల్లంతు అవుతుందని తెలిపారు. ఒకవేళ ఎవరికైనా గత 2002 ఎస్ఐఆర్ వివరాలు తెలియకపోతే సర్కిల్ వారీగా నెలకొల్పిన హెల్ప్ డెస్క్ ను, లేదా బీఎల్ఓ లను సంప్రదించాలని సూచించారు. అయినప్పటికీ వివరాలు తెలియని పక్షంలో ప్రస్తుత ఓటరు జాబితా వివరాలు పొందుపరచి ఫారం సమర్పించవచ్చని అన్నారు.
అలాంటి వారి పేరు కూడా ముసాయిదా ఓటరు జాబితాలో చేర్చబడుతుందని తెలిపారు. వారికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఈ.ఆర్.ఓ) నోటీసు జారీ చేసే హియరింగ్ కు పిలుస్తారని, ఎన్నికల సంఘం నిర్దేశించిన 13 రకాల గుర్తింపు ధృవీకరణ పత్రాలలో ఏదైనా ఒక దానిని చూపిస్తే ఓటరు తుది జాబితాలో పేరు చేరుస్తారని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారం అందజేయాలని కలెక్టర్ సూచించారు. ఈ విషయంలో బూత్ లెవెల్ ఏజెంట్లు క్షేత్రస్థాయిలో ఉంటూ క్రియాశీలక పాత్ర పోషించాలని, ప్రతి రోజు ఓటర్ల నుండి 50 చొప్పున ఫారంలు సేకరించి బీఎల్ఓలకు అందించేలా చొరవ చూపాలన్నారు. ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు కూడా క్షేత్రస్థాయిలో ఉంటూ, ఎన్యూమరేషన్ ఫారంల సేకరణ, వాటి డిజిటలైజేషన్ ప్రక్రియలు వేగవంతం అయ్యేలా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా అందుబాటులో లేని, చనిపోయిన, శాశ్వతంగా వలస వెళ్ళిన, రెండు చోట్ల ఓటు కలిగిన ఓటర్ల పేర్లను గుర్తిస్తూ పక్కాగా జాబితాను రూపొందించి, వాటిపై బీఎల్ఏల సంతకాలు తీసుకోవాలన్నారు.






