ఖద్దరు చొక్క కనుసైగల్లో స్క్రాప్ మాయం.. మళ్లీ తెరపైకి వివాదం

by Dishanational2 |
ఖద్దరు చొక్క కనుసైగల్లో స్క్రాప్ మాయం.. మళ్లీ తెరపైకి వివాదం
X

దిశ,గోదావరిఖని : రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లోని పలు విభాగాలు అవినీతి జరిగిందని, ప్రతిపక్ష కార్పొరేటర్ లతోపాటు ఇతర సంఘాలకు చెందిన కొంత మంది నాయకులు అధికారుల తీరుపై విజిలెన్స్ అధికారులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే కార్పొరేషన్‌లో మూడు రోజుల పాటు విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. పలు ఫైళ్లను పరిశీలించారు. అయితే గతంలో వివాదాస్పదంగా మారిన స్క్రాప్ మాయంపై విజిలెన్స్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కార్పొరేషన్‌కు సంబంధించిన స్క్రాప్ ని మాయం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రభుత్వానికి చెందిన ఆస్తిని, అధికారంను అడ్డం పెట్టుకొని తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఓ కార్పొరేటర్ భర్త స్క్రాప్‌ను అమ్ముకోవడం‌పై ప్రజా సంఘాల నాయకులతోపాటు ప్రతిపక్ష కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్క్రాప్‌ను తరలిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఉన్నతాధికారులు ఇప్పటివరకు దానిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అయితే గతంలో రామగుండం కార్పోరేషన్ లో పని చేసిన ఓ అధికారి ఈ స్క్రాప్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించి రాత్రికి రాత్రే లక్షల రూపాయలు చేతులు మార్చినట్లు సైతం విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది జరిగిన కొన్ని రోజుల వ్యవధిలోనే సదరు అధికారి పెద్దపెల్లి జిల్లాలోని తన కార్యాలయంలో లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ అవినీతి అధికారులకు పట్టుబడటం మరింత చర్చకు దారి తీసింది. ఈ సదరు అధికారి స్క్రాప్ మాయంపై వరుస కథనాలు ప్రచురితం కావడంతో ఆ సమయంలో ఓ రాత్రి కార్పొరేటర్‌తో రహస్య సమావేశమై వాటాలు పంచుకున్నట్లు సైతం పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా పాత మున్సిపల్ కార్యాలయానికి సంబంధించిన ఓ గదిని సదురు కార్పొరేటర్ భర్త ఆక్రమించి తన సొంత అవసరాల కోసం ఉపయోగిస్తున్న ట్లు స్థానిక ప్రజలు కోడై కూస్తున్నారు. ఈ గది కేంద్రంగానే స్క్రాప్ కు సంబంధించిన సెటిల్మెంట్లు జరిగినట్లు జోరుగా స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే భార్య అధికారాన్ని అడ్డం పెట్టుకొని సదరు నాయకుడు ఎన్నో సెటిల్మెంట్‌లతో పాటు అవినీతి ఆరోపణలకు పాల్పడుతున్నాడనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా విజిలెన్స్ అధికారులు స్పందించి పూర్తిస్థాయి విచారణ చేపట్టి సంబంధిత నాయకుడిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.

ఫిర్యాదు చేసి ఆరు నెలలైనా బాధ్యులపై చర్యలు శూన్యం..

అధికార పార్టీ నాయకుడనో.. లేక రాజకీయ పలుకుబడి ఉందనో తెలియదు కానీ ప్రభుత్వ ఆస్తిగా భావించే మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన స్క్రాప్ ను నమ్ముకున్న ఘటనపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గతంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేసిన శంకర్ కుమార్ గత సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు స్క్రాప్ నిందితులను పెట్టుకోకపోవడం పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై అధికార ఒత్తిడితో కేసును నీరుగారుస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.లక్షల రూపాయల స్క్రాప్ కుంభకోణం చేసిన సదరు వ్యక్తులను పెట్టుకోకపోవడం వెనుక అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా దీనిపై అధికారులు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.


Next Story